జగన్ సాక్షి ఎఫెక్ట్... మాకొద్దు, భయమేస్తోంది: సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్
సదావర్తి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.తాజాగా, వేలంలో భూములు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ రివర్స్ అయింది.
కడప/అమరావతి: సదావర్తి భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, వేలంలో భూములు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ రివర్స్ అయింది. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.
అందుకే తీసుకునేందుకు వెనక్కి
వేలంపాటలో భూములు దక్కించుకున్న పాటదారులు ఇప్పుడు భూములు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. తమపై కొందరు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
నారా లోకేష్, ఆదినారాయణలతో లింక్
మంత్రులు ఆదినారాయణ రెడ్డి, నారా లోకేష్తో తమకు సంబంధం ఉందంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని వేలం పాటలో భూములను దక్కించుకున్న శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారన్నారు.
ఇన్ని కోట్లు పెట్టాక మాకు జరగరానిది జరిగితే, భయపడ్డారు
ఇన్ని కోట్లు వెచ్చించిన తమకు జరగరానిది జరిగితే ఎలాగని వారు ప్రశ్నించారు. అందుకే భూములను తీసుకోరాదని నిర్ణయించామన్నారు. తమపై వైసిపి ఆరోపణలు చేస్తోందన్నారు. తమకు వ్యతిరేకంగా వైసిపి నేతలు చేసిన ప్రచారంతో తమ భాగస్వాములు భయపడిపోయారన్నారు.
సాక్షిలా దారుణంగా రాశారు
అందరు భయపడుతున్న నేపథ్యంలో భూములు వదులుకోవడమే మంచిదని తాము భావిస్తున్నామని సత్యనారాయణ బిల్డర్స్ చెప్పారు. రాజకీయంగా తమకు సంబంధాలు ఉన్నప్పటికీ, తాము ప్రధానంగా వ్యాపారస్తులమే అన్నారు. ఈ రోజు సాక్షి పేపర్లో చాలా దారుణంగా రాశారని చెప్పారు.
డిపాజిట్ నష్టపోయేందుకు కూడా సిద్ధమే
తాము ఓపెన్ ఆక్షన్లో పాట పాడామని, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాము భూమిని సొంతం చేసుకొని వ్యాపారం చేయలేమని వారు తెలిపారు. ఈ డబ్బును తాము చెల్లించని పక్షంలో, డిపాజిట్ మొత్తాన్ని తాము కోల్పోవాల్సి ఉంటుందని, దానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. తాము విత్ డ్రా అయితే అధిక ధర కోట్ చేసిన రెండో వ్యక్తికి భూములను అప్పగిస్తామంటూ, వేలంపాట సమయంలో అధికారులు క్లియర్గా చెప్పారన్నారు.
వేలంలో దక్కించుకున్నారు
తమిళనాడులోని 83.11 ఎకరాల సదావర్తి సత్రం భూముల వేలం ఇటీవల నిర్వహించగా రూ.60.30 కోట్లకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ సంస్థకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, పద్మనాభయ్య దక్కించుకున్నారు. ఏడాదిన్నర కిందట వేలం నిర్వహించగా ఏపీకి చెందిన సంజీవరెడ్డి రూ.22.40 కోట్లకు వీటిని కైవసం చేసుకున్నారు. కారు చౌకగా అధికారపక్షం వారు దక్కించుకున్నారని, ఈ భూముల విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుందని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టును ఆశ్రయంచారు. దీంతో తాజాగా సోమవారం మళ్లీ వేలం నిర్వహించారు.