వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ ... శ్రీనివాసుల రెడ్డి మృతి కేసు మిస్టరీతో లింక్
వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎన్నో .. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి మృతి వై ఎస్ వివేకా హత్యకేసును కొత్త మలుపు తిప్పింది. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడైన కసునూరి పరమేశ్వర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి స్వయానా బావమరిది. కసునూరి పరమేశ్వర్ రెడ్డి నార్కో పరీక్షలకు నిరాకరించటం , శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యలో పలు అనుమానాలు ఉండటం వంటి కారణాలు వివేకా హత్య కేసుకు, శ్రీనివాసులు రెడ్డి మృతికి ఏదో సంబంధం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
కొత్త మలుపులు తిరుగుతున్న వివేకా మర్డర్ మిస్టరీ .. 1300 మందిని విచారించిన సిట్ అధికారులు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద్ రెడ్డి హత్య మిస్టరీ కొత్త మలుపులు తీసుకుంది. ఈ ఏడాది ఎన్నికలకు ముందు మార్చి 15 న ఈ దారుణ హత్య జరిగిన తరువాత హత్య మిస్టరీని చేదించటానికి ఇప్పటి వరకు 1300 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారు . ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు, పరమేశ్వర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, కాపలాదారు రంగయ్య, ఎర్రా గంగి రెడ్డిని నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించేందుకు గుజరాత్కు పంపారు. వీరిలో, కె పరమేశ్వర్ రెడ్డి నార్కో పరీక్షను నిరాకరించారు . ఇక పరమేశ్వర్ రెడ్డి బామ్మరిది మరో నిందితుడు శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పదంగా మరణించారు.
శ్రీనివాసుల రెడ్డి అనుమానాస్పద మృతితో కేసులో కొత్త ట్విస్ట్ ... దర్యాప్తు వేగం పెంచిన సిట్
సిట్ అధికారుల హింసను భరించలేక శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు ఆరోపించారు. కానీ ఈ అనుమానాస్పద మృతిలో చాలా కొత్త కోణాలు పోలీసుల దర్యాప్తులో తెలిశాయి. శ్రీనివాసులు రెడ్డి మరణం వెనుక గల కారణాలపై సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసులు రెడ్డిని హత్య చేసినట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయని సమాచారం. శ్రీనివాసులు రెడ్డి చేతి రాతను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అధికారులు, శ్రీనివాసులు రెడ్డి ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తి , కానీ రాసిన సూసైడ్ నోట్స్ కుడి చేతి వాటం ఉన్న రాతలని గుర్తించారని సమాచారం . అలాగే శ్రీనివాసుల రెడ్డిది ఆత్మహత్య కాదు హత్య అని తరువాత దానిని ఆత్మహత్యలాగా క్రియేట్ చేశారని గుర్తించి ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.
శ్రీనివాసులు రెడ్డి మృతితో లింక్ అయిన వివేకా హత్యకేసు... త్వరలోనే ఛేదిస్తామంటున్న సిట్
శ్రీనివాసులు రెడ్డి మృతితో లింక్ అయిన వివేకా హత్యకేసులో శ్రీనివాసులు రెడ్డి మృతి కి గల కారణాలను , దీని వెనుక ఉన్న వారు ఎవరు అన్నది గుర్తిస్తే తప్పక వివేకా హత్యకేసు మిస్టరీ వీడినట్టే అని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఒకసారి విచారణ చేస్తేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు శ్రీనివాసుల రెడ్డి కాదని స్థానికంగా అతని మరణంపై పలు అనుమానాలు సైతం లేకపోలేదు. ఇక ఈ నేపధ్యంలో సాధ్యమైనంత త్వరగా సిట్ శ్రీనివాసుల రెడ్డి మృతి మిస్టరీతో పాటు వివేకా హత్యకేసు మిస్టరీని సైతం ఛేదించనుంది .