ఏపిలో భారీగా యువ - నయా ఓటర్లు. ఎవరి మద్దతు ఎవరికి :ఏపి లో మొత్తం 3.69 కోట్ల ఓట్లు ..!
ఏపిలో తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఎన్నికలు సమీపిస్తన్న వేళ.. సవరణల అనంతరం ఈ జాబితా ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపిలో 25 లోక్సభ..175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఒటర్లు లిస్టును ప్రచురించింది. అయితే, ఈ సారి ఎన్నికల జాబితాలో సవరణల తరువాత కొత్తగా చేరిన ఓటర్లు 21.24 లక్షలు కాగా, 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 5.39 లక్షల మందిగా ప్రకటించారు. దీంతో..ఇప్పుడు ఈ యువ ఓటర్లు ఏపిలో ఏ పార్టీ వైపు..ఏ నేత వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారింది.
ఓటర్ల జాబితా విడుదల : 3.69 కోట్ల ఓట్లు
ఏపిలో రాజకీయం రంజుగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారనే సమాచారం నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలకమైన ఓటర్ల జాబితా విడుదల చేసింది. సవరణల తరువాత లిస్టును ప్రకటించింది. ఇసి లెక్కల ప్రకారం ఏపిలో మొత్తం ఓటర్లు: 3,69,33,091, కాగా ఇందులో పురుషుల సంఖ్య 1,83,24,588, మహిళా ఓటర్లు 1,86,04,742 గా ప్రకటించారు. ఇక, 18 -19 ఏళ్ల మధ్య యువ ఓటర్ల సంఖ్య 5,39,804 గా ఉంది. ఇందులో పురుషులు - 3,11,059, మహిళలు-2,28,625 ఉన్నారు. అయితే, సమగ్ర సవరణ-2019 ప్రకారం కొత్తగా చేరిన ఓటర్లు ..21,24,525 గా ఉండగా.. ఈ సవరణల ప్రకారం తొలగించిన ఓటర్ల సంఖ్య: 3,86,694 గా ఉంది.
మహిళా ఓటర్లే అధికం..ఎవరికి కలిసొచ్చేను..
ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల సంఖ్యలో మహిళా ఓటర్ల సంఖ్చే ఎక్కువగా ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసే నాటికి రాష్ట్రంలో 3,51,95,260 మంది ఓటర్లు ఉండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ-2019 చేపట్టిన అనంత రం అదనంగా 17,37,831 మంది ఓటర్లు పెరిగారు. ఇప్పుడు ఏపిలో మహిళా ఓటర్లు మెజార్జీ మద్దతు ఎవరికి ఇస్తారనే అంశం పై చర్చ మొదలైంది. మహిళా ఓటింగ్ శాతం ఏపిలో ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2014 ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ పై టిడిపి ఇచ్చిన హమీ ప్రధానంగా పని చేసింది. అయితే, టిడిపి అధికారంలోకి వచ్చిన తరు వాత మాఫీ కాదు..ప్రోత్సాహకం పేరుతో ఒక్కో డ్వాక్రా మహిళకు పది వేల రూపాయాల చొప్పున ఇచ్చారు. ఇక, తాజాగా ఎన్నికల ముందు మరో దఫా పది వేల చొప్పున ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇక, డ్వాక్రా మహిళలకు జగన్ సైతం తన నవరత్నాల్లో హామీ ఇచ్చారు. పవన్ కళ్యాన్ సైతం మహిళల్లో అభిమానం సంపాదించారు. మరి..ఏపి మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అనే పరిస్థితి ఏపి రాజకీయాల్లో కనిపిస్తోంది.
ప్రతీ ఓటు కీలకమే : యువత మద్దతెవరికి..!
రాష్ట్ర విభజన తరువాత ఏపిలో 2014 లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1.95 శాతం మాత్రం అధికార - విపక్షాల మధ్య ఓట్ల తేడా నమోదైంది. ఈ సారి అంతకంటే టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగానూ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఓటర్ల సవరణ తరువాత కొత్తగా జాబితాలో చేరిన ఓటర్లు: 21,24,525 కాగా, తొలగించిన ఓటర్ల సంఖ్య: 3,86,694 గా ఉంది. ఇక, 18-19 ఏళ్ల వయసు ఉన్న వారి సంఖ్య 5,39, 804 గా ఉంది. ఇప్పడు ఏపిలో ఇద్దరు యువ నేతలు..ఒక సీనియర్ నేత నాయకత్వం వహిస్తున్న పార్టీలు ప్రధాన బరిలో ఉన్నాయి. ఏపికి ప్రత్యేక హోదా కీలక అంశంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపి లో కొత్తగా చేరిన ఓటర్లు..ప్రధానంగా యువత ఎవరికి మద్దతి స్తారనేది ఆసక్తి కరంగా మారింది. యువ నేతలుగా ఉన్న జగన్ వైపా..లేక పవన్ వైపా..వీరిద్దరూ కాదని ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబు కే జై కొడతారా అనేది కీలక అంశం. గెలుపు ఓటముల్లో ఈ సారి ఏపిలో ప్రధానంగా పార్టీలు-నేతల పై అభిమానంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, యువతను ఆకట్టుకో వటానికి అన్ని రకాలు ప్రయత్నాలు ప్రారంభం కానున్నాయి.