తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడం ... తగ్గేదెవరో... నెగ్గేదెవరో !!
తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెలకొనాలని, నది జలాలను పంచుకోవడంపై తెలంగాణ , మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని , గతంలో జల వివాదాలు పరిష్కరించాలని పలు మార్లు భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు జలవివాదాల పరిష్కారంలో సక్సెస్ కాలేకపోయారు. ఇక తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల జగడం నెలకొంది. గత ప్రభుత్వ హయాం నుండి జల వివాదాలు పరిష్కారం కాకుండా ఉండగా తాజాగా మరో జల వివాదం కూడా ఈ లిస్టు లో చేరింది .
తెలుగు రాష్ట్రాలకు తలనొప్పిగా కరోనా .. సరిహద్దుల్లో నో ఎంట్రీ .. నిబంధనలు కఠినతరం
సముద్రంలో వృధాగా పోతున్న నీరు ఎత్తిపోయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఈ ఏడాది 800 టీఎంసీల నీరు సముద్రం పాలైన నేపధ్యంలో అలా వరదనీరు దుర్వినియోగం కాకుండా ఉండేలా సీఎం జగన్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే ఆలోచన చేశారు . పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం రూ.7 వేల కోట్లతో పాలనాపరమైన అనుమతులను ఇచ్చారని తెలుస్తుంది .
శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే కొత్త ఎత్తిపోతల పథకం.. జీవో జారీ
కృష్ణాకు సగటున 30 రోజుల పాటు మాత్రమే వరద వస్తోందని, ఈ సమయంలోనే నీటిని పూర్తిగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఇక దీని కోసం నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. నీటి వినియోగం కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డ్ ప్రకారమే ఉంటుంది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోలేదన్న తెలంగాణా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల చర్చల తర్వాతే ఇరు రాష్ట్రాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం .తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ అపెక్స్ కమిటీ అనుమతులు తీసుకోలేదు . ఇక ఇది తెలంగాణా రాష్ట్రానికి ఆయుధంగా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ తీసుకున్న ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.
ఉమ్మడి ప్రాజెక్ట్ పై ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆగ్రహం
అయితే తెలంగాణా సీఎం కేసీఆర్ మాత్రం ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్నది ఏకపక్ష నిర్ణయం అని అభిప్రాయపడిన ఆయన ఇరిగేషన్ శాఖపై సోమవారం రాత్రివరకూ రివ్యూ చేసి తెలంగాణ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్ట్ భంగకరమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని , ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణా వాటర్బోర్డులో ఫిర్యాదుచేస్తామని కేసీఆర్ తెలిపారు.
Recommended Video
ప్రాజెక్ట్ ను అడ్డుకుని తీరతామన్న తెలంగాణా .. తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల వివాదం
ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి అవసరం అయితే రాజకీయ పోరాటం కూడా చేస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రాజెక్ట్ .. తెలంగాణా తో సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవటం, అలాగే అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదం అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా పాత జల వివాదాలు పరిష్కారం కాకపోగా కొత్తగా మరో జల జగడం తెలుగురాష్ట్రాల మధ్య వచ్చి చేరింది. పంతాలు, పట్టింపులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేరాఫ్ కావటంతో ఇక ఈ వ్యవహారంలో తగ్గేదెవరో .. నెగ్గేదెవరో వేచి చూడాలి .