చైనాకు ముంచుకొస్తున్న కరోనా వేవ్?
కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. నూతన సంవత్సర వేడుకలు చైనాను మరింత కలవరపెడుతున్నాయి. సెలవులవల్ల దేశవ్యాప్తంగా కోట్లమంది చైనీయులు తమ సొంత గ్రామాలకు తరలివెళ్లారు. ఇప్పుడు చైనా ప్రభుత్వాన్ని ఈ అంశమే కలవరపెడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా దీనిపైనే ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా జనాభాలో ఇప్పటికే 80 శాతం మందికి వైరస్ సోకిందని చైనా ప్రభుత్వ ప్రధాన అంటువ్యాధుల నిపుణుడు ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే మూడు నెలల్లో మహమ్మారి పుంజుకునే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. దాదాపు 80 శాతం మందికి కొవిడ్ సోకడంవల్ల యాంటీ బాడీలు ఉత్పన్నమవుతాయంటున్నారు.
కొత్త సంవత్సరం సెలవుల నేపథ్యంలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని, దీనివల్ల వైరస్ విస్తరించే అవకాశం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్యూ వెల్లడించారు. అయితే కొన్ని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతాయని, భవిష్యత్తులో రెండో వేవ్ వచ్చే అవకాశం లేదని చెప్పారు. దేశ జనాభాలో ఇప్పటికే 80 శాతం మందికి కరోనా సోకిందన్నారు. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లకు పైగా ఉంది.
కరోనావల్ల ఆస్పత్రుల్లో చేరికల విషయంలో ఇప్పటికే గరిష్ఠ స్థాయిని దాటినట్లు చైనా ప్రకటించింది. మరోవైపు.. వైరస్ కారణంగా చైనాలో నిత్యం వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయికానీ ప్రభుత్వం వీటిని కొట్టేస్తోంది. జీరో కొవిడ్ ఎత్తేసిన నెల రోజుల్లోనే 60 వేల కొవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. న్యూ ఇయర్ సెలవుల సమయంలో రోజూ 30 వేలకుపైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా చైనా అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది.