కరోనా కోరల్లో ఏపీ: 25 వేలకు పైగా: మరింత విజృంభిస్తోన్న వైరస్: రోజురోజుకూ..జెట్ స్పీడుతో
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగా.. ఈ సారి ఆ సంఖ్య 1500లను దాటేసింది. వరుసగా రెండో రోజు కూడా ఈ మార్క్ను అధిగమించాయి పాజిటివ్ కేసులు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రాష్ట్రంలో 1608 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇందులో వేర్వేరు జిల్లాల్లో నమోదైన కేసులు 1576 కాగా.. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారి వల్ల కొత్తగా 36 కేసులు నమోదు అయ్యాయి. 15 మంది మృత్యువాత పడ్డారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 21,020 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరుకుంది. ఇందులో 13,194 మంది డిశ్చార్జి అయ్యారు. 292 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 11,936గా నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు.
అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వందకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో జిల్లాలో ఈ సంఖ్య రెండొందలను అధిగమించింది. చిత్తూరు-208, అనంతపురం-191, తూర్పు గోదావరి-169, గుంటూరు-136, కర్నూలు-144, ప్రకాశం-110, పశ్చిమ గోదావరి-144 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కడప-91, కృష్ణా-80, నెల్లూరు-51, శ్రీకాకుళం-80, విశాఖపట్నం-86, విజయనగరం-86 కేసులు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసులతో పాటుగా రాష్ట్రంలో కరోనా మరణాలు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా 10కి పైగా మృత్యువాత పడుతున్నారు. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో మృతుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటోంది.
Recommended Video
కరోనా వల్ల మరణించిన వారిలో అత్యధికులు వయోధిక వృద్ధులేనని చెబుతున్నారు. శ్వాసకోశ సంబంధ ఇబ్బందుల వల్లే వారు మరణిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. కరోనా టెస్టుల సంఖ్యలో తరచూ హెచ్చుతగ్గుల కనిపిస్తున్నాయి. రోజూ 30 వేలకు పైగా శాంపిళ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కుదరట్లేదు.