ఏపీలో ఒక్కరోజే 43 మంది బలి: 400 దాటిన కరోనా మరణాలు: తగ్గని ఉధృతి: భయం కలిగించేలా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఒక ఎత్తు కాగా..అంతకంతకూ మరణాలు నమోదు అవుతుండటం మరో ఎత్తుగా మారింది. ఇటీవలే 37 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడగా.. ఆ సంఖ్యను తాజాగా నమోదైన మరణాలు అధిగమించాయి. 24 గంటల్లో 43 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మరణాల్లో ఇదే అత్యధికం.
కొత్తగా 1916 కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 1916 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1908 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల ఎనిమిది కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22,670 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కి చేరుకుంది. ఇందులో 17,467 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 408 మందిమరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,144గా నమోదైంది.
అత్యధిక మరణాలు అనంతపురంలో
24 గంటల వ్యవధిలో మొత్తం 43 మంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. అత్యధిక మరణాలు అనంతపురంలో నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 10 మంది మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో అయిదుమంది చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు.
జిల్లాల్లో కొనసాగుతోన్న ఉధృతి..
జిల్లాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల పెరుగుదలలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. అన్ని జిల్లాల్లోనూ కేసులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అనంతపురం-185, చిత్తూరు-238, తూర్పు గోదావరి-160, గుంటూరు-146, కడప-112, కృష్ణా-129, కర్నూలు-169, నెల్లూరు-165, ప్రకాశం-32, శ్రీకాకుళం-215, విశాఖపట్నం-28, విజయనగరం-130, పశ్చిమ గోదావరి-199 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. చాలాకాలం పాటు కరోనా ఫ్రీ జిల్లాలుగా కనిపించిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.