ఏపీలో పీక్స్లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగా.. ఈ సారి ఆ సంఖ్య రెండువేలకు చేరువ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రాష్ట్రంలో 1933 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1900లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కొత్తగా నమోదైన 1933 పాజిటివ్ కేసుల్లో 1914 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. 19 కేసులు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన ద్వారా వ్యాప్తిచెందాయి. కొత్తగా 19 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 17,624 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువగా వెళ్లింది. మొత్తం 29,168 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15,412 మంది డిశ్చార్జి అయ్యారు. 328 మంది మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య 13,428గా నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. కృష్ణా, విశాఖపట్నంలల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. మొత్తం 19 మంది మరణించడం కూడా రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో మూడు జిల్లాల్లో రెండువందలకు పైగా, ఏడు జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం-129, చిత్తూరు-159, తూర్పు గోదావరి-268, గుంటూరు-152, కడప-94, కృష్ణా-206, కర్నూలు-237, నెల్లూరు-124, ప్రకాశం-134, శ్రీకాకుళం-145, విశాఖపట్నం-49, విజయనగరం-138, పశ్చిమ గోదావరి-79 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పాజిటివ్ కేసులతో పాటుగా రాష్ట్రంలో కరోనా మరణాలు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో మృతుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటోంది.
Recommended Video
అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇప్పటిదాకా నమోదైన కేసులు మూడువేలను దాటేశాయి. అనంతపురం-3290, గుంటూరు-3019, కర్నూలు-3405 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్యలో చోటు చేసుకున్న ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే మిగిలిన కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మూడువేల మార్క్ను అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ పరీక్షలను మరింత ముమ్మరం చేస్తున్నామని, ఫలితంగా కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల ఉండొచ్చని అంటున్నారు.