ఏపీలో వెయ్యిమందికి పైగా కోలుకున్న పేషెంట్లు..డిశ్చార్జి: అక్కడ జీరో: ఆ అయిదు జిల్లాల్లోనే
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. నాలుగురోజులుగా 50కి లోపే పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం అధికార యంత్రాగాన్ని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. దీనికితోడు- కరోనా వైరస్ సోకిి.. వేర్వేరు ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతోన్న పేషెంట్ల కంటే.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా ఉధృతిలో కొంతమేరకైనా వేగం నెమ్మదించిందని అంటున్నారు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు.
రాష్ట్రంలో కొత్తగా 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ మేరకు తాజా బులెటిన్ను విడుదల చేశారు. మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరినట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందినవే. చిత్తూరు జిల్లాలో 10, కర్నూలు, నెల్లూరుల్లో తొమ్మిది చొప్పున పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నమోదైన 19 కేసులు కూడా చెన్నైలోని కోయంబేడు మార్కెట్తో ముడిపడి ఉన్నవేనని అధికారులు తెలిపారు.
విశాఖలో మంత్రుల నిద్ర వెనుక అసలు ప్లాన్ ఇదేనా?: ఇక జగన్ కూడా: త్వరలో క్యాంపు కార్యాలయం షిఫ్ట్?
నిత్యావసర సరుకులు, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాల కోసం తమిళనాడు సరిహద్దుల్లోని ఈ రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చారని చెప్పారు. కోయంబేడు మార్కెట్ వల్ల తమిళనాడులో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలో నాలుగు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో వైరస్ బారిన పడిన ఆ ఒక్కరు కూడా కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చినట్లు చెప్పారు.
కాగా.. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కంటే డిశ్చార్జి అయిన వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం 2051 పాజిటివ్ కేసులు నమోదు కాాగా.. అందులో 1056 మంది డిశ్చార్జి అయ్యారు. 46 మంది మరణించారు. 996 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జి అయిన కేసుల్లో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు టాప్లో ఉంటున్నాయి. కర్నూలు-284, కృష్ణా-155, గుంటూరు-181 మంది ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు.
Recommended Video
24 గంటల వ్యవధిలో ఎనిమిది జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అనంతపురం, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జీరో కేసులు నమోదు అయ్యాయి. వందల సంఖ్యలో కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో తొలిసారిగా ఒక్క పాజిటివ్ కూడా నమోదు కాలేదు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగుతుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆశిస్తున్నారు.