ఏపీ విలవిల: ఇప్పట్లో తగ్గేదెలా?: గంటగంటకూ పాజిటివ్ కేసులు: కట్టడి చర్యలు ఎన్ని ఉన్నా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పట్లో తగ్గేలా పరిస్థితీ కనిపించట్లేదు. వైరస్ తీవ్రతను తగ్గించడానికి, పాజిటివ్ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఏదో ఒక రూపంలో విఫలమౌతున్నాయి. కువైట్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలానికి చేరుకుంటోన్న వారి వల్ల ఈ సారి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
Recommended Video
తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా..ఏపీ క్రైస్తవ రాజ్యంగా: కేసీఆర్, జగన్పై బీజేపీ ఫైర్బ్రాండ్
రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగ44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 10,240 మంది శాంపిళ్లను పరీక్షించగా.. 44 పాజిటివ్ కేసులు తేలినట్లు నిర్ధారించారు. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది. ఇందులో 1848 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56 మందిని డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న కేసులు 767.
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులు, కోవిడ్ ఆసుపత్రుల్లో వారంతా చికిత్స పొందుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలానికి వచ్చి కరోనా వైరస్ బారిన పడిన మొత్తం పేషెంట్ల సంఖ్య 62కు చేరింది. ఇందులో 41 మంది కువైట్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు ఖతర్ నుంచి ఒకరు సౌదీ అరేబియా నుంచి రాష్ట్రానికి వచ్చారని అన్నారు. ఇదివరకు వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు చెప్పారు.
మరోవంక రాష్ట్రంపై చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రభావం సైతం కొనసాగుతోంది. 24 గంటల్లో నమోదైన కేసుల్లో చిత్తూరులో అయిదు, నెల్లూరు రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కోయంబేడు మార్కెట్ వల్లే పెరిగాయని అధికారులు వెల్లడించారు. వాటి కాంటాక్టుల కోసం గాలిస్తున్నామని అన్నారు. కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు పలువురు కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. వారిని ఐసొలేషన్ వార్డులకు తరలించారు.