మళ్లీ మొదటికొచ్చినట్టే: ఏపీలో హాఫ్ సెంచరీ దాటిన కరోనా కేసులు: కొంత గ్యాప్ తరువాత..
అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించింది. కొద్దిరోజుల గ్యాప్ తరువాత భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కసారిగా పెరిగిపోయాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే వస్తోంది. దీనితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటోన్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఫలితంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకున్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో-కరోనా బారి నుంచి పెద్ద సంఖ్యలో పేషెంట్లు కోలుకుంటున్నారని అన్నారు.
ఆర్టీసీకి కొత్త టాస్క్: బోర్డర్ టు బోర్డర్: లాక్డౌన్ ముగిసేంత వరకూ: ప్రత్యేక రైళ్లు
హాఫ్ సెంచరీ..
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 52 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2282కు చేరింది. ఇందులో యాక్టివ్గా ఉన్నవి 705 మాత్రమే కావడం ఊరట కలిగిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం కేసుల్లో 1527 మంది డిశ్చార్జి అయ్యారు. 50 మంది మరణించారు. చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై కొనసాగుతోంది. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటోన్న ఈ రెండు జిల్లాలకు చెందిన చిరు వ్యాపారులు హోల్సేల్గా నిత్యావసర సరుకులు, వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడానికి కోయంబేడు మార్కెట్కు వెళ్లొస్తుంటారు.
ఆ రెండు జిల్లాల్లో..
24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరులో ఏడు, తూర్పు గోదావరి జిల్లాలో అయిదు, కర్నూలులో నాలుగు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు చొప్పన కేసులు నమోదు అయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్క కేసు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో మొత్తం 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 12 కేసులు కోయంబేడు మార్కెట్తో లింకులు ఉన్నవే. అలాగే- నెల్లూరు జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఏడుకు ఏడు కేసులు కూడా కోయంబేడుతో ముడిపడి ఉన్నవే కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
మహారాష్ట్ర ఎఫెక్ట్..
పొరుగు రాష్ట్రల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 150 మంది ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంది. మహారాష్ట్ర నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 101 మంది కరోనాకు గురయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన 26 మంది, రాజస్థాన్ నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో 11 మందికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారిలో ఒక్కొక్కరు వైరస్ చికిత్స పొందుతున్నారు. మొత్తం 150 కేసులు కాగా.. 25 మంది ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 125గా నమోదు అయ్యాయి.
Recommended Video
జిల్లాలవారీగా..
24 గంటల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో మాత్రమే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన అన్ని జిల్లాల్లో కేసులు వెలుగులోకి రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటిదాకా నమోదైన కేసుల వివరాలు జిల్లాలవారీగా అనంతపురం-122, చిత్తూరు-192, తూర్పు గోదావరి-57, గుంటూరు-417, కడప-104, కృష్ణా-382, కర్నూలు-615, నెల్లూరు-157, ప్రకాశం-66, శ్రీకాకుళం-14, విశాఖపట్నం-76, విజయనగరం-8, పశ్చిమ గోదావరి-72 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో మొత్తంగా 1527 మంది డిశ్చార్జి అయ్యారు. 50 మంది మరణించారు.