ఏపీలో ప్రమాదకరంగా విస్తరణ: చేయి దాటిన పరిస్థితులు: ఏడున్నర లక్షలకు పైగా టెస్టులు
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. లాక్డౌన్ సడలింపుల సమయంలో ప్రజలు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా యథేచ్ఛగా తిరుగాడుతుండటం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.
ఒక్కరోజులో 553
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 553 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 19,085 శాంపిళ్లను పరీక్షించగా.. 553 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 477 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా.. 76 కేసులు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారి ద్వారా నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు.
మరణాల సంఖ్యలో పెరుగుదల..
దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,884కు చేరుకుంది. ఇందులో ఇప్పటిదాకా 4988 మంది డిశ్చార్జి అయ్యారు. 136 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 5760గా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే రాష్ట్రంలో మరణించే వారి సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా..
24 గంటల వ్యవధిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 72 కేసులు వెలుగు చూశాయి. అనంతపురం-52, చిత్తూరు-42, తూర్పు గోదావరి-64, గుంటూరు-6, కడప-22, కృష్ణా-47, నెల్లూరు-29, ప్రకాశం-18, శ్రీకాకుళం-1, విశాఖపట్నం-40, విజయనగరం-5, పశ్చిమ గోదావరి-18 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి.
Recommended Video
ఏడున్నర లక్షలకు పైగా
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు గరిష్ఠస్థాయిలో నమోదు అయ్యాయి. కరోనా వైద్య పరీక్షలను ఆరంభించినప్పటి నుంచీ ఇప్పటిదాకా 7,69,319 మందికి వైరస్ పరీక్షలను నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో 19,085 శాంపిళ్లను పరీక్షించారు. ఒక రాష్ట్రంలో ఏడున్నర లక్షలకు పైగా పరీక్షలను నిర్వహించడం ఇదే తొలిసారి. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.