కరోనా బారిన ఏపీ: ఇప్పటిదాకా 52 మంది మృత్యువాత: చిత్తూరుజిల్లాలో తొలి మరణం: భారీగా కేసులు
అమరావతి: రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా మరోసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణించారు. దీనితో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 52కు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో తొలి మరణం సంభవించింది. ఇప్పటిదాకా ఈ జిల్లాలో కరోనా వల్ల ఒక్కరు చనిపోలేదు. 70 సంవత్సాల వయస్సున్న ఓ వృద్ధుడు మృతి చెందారు.
కోస్తా తీర గ్రామాల్లో అలజడి: భారీగా మోహరించిన ఎన్డీఆర్ఎఫ్: మైకుల ద్వారా హెచ్చరిస్తూ..
కొత్తగా 57 కేసులు..
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 57 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2339కు చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసులు 691. ఇప్పటిదాకా 1596 మంది కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 52 మంది మృత్యువాత పడ్డారు. రికవరీ రేటు భారీగా నమోదవుతోందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో వేర్వేరు జిల్లాల నుంచి మొత్తం 69 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని తెలిపారు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై కోయంబేడు ప్రభావం..
తమిళనాడు సరిహద్దులకు ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాపై చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రభావం కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో నమోదైన పాజిటివ్ కేసుల్లో అయిదు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక కేసు కోయంబేడు మార్కెట్ ప్రభావం వల్లే నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారి ద్వారా సెకెండ్ కాంటాక్ట్గా ఇతరులకు ఈ వైరస్ సోకుతోందని అంచనా వేశారు. కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారు, వారి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నామని, దీనికోసం గ్రామ, వార్డు వలంటీర్ల సహకారాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు.
చిత్తూరు, కర్నూలుల్లో తొలి మరణం..
24 గంటల వ్యవధిలో చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో తొలి మరణం ఇదే. 70 సంవత్సరాల వయస్సున్న వృద్ధుడొకరు మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో పది రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ట్రావెల్ హిస్టరీ ఉన్న కుమారుడి ద్వారా ఆ వృద్ధుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఆయన మరణించినట్లు అధికారులు తెలిపారు.