ఏపీలో అదుపు తప్పిన కరోనా: యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయ్: వాటికి బ్రేక్ వేస్తాయా?
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టు తప్పింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. సాధారణ పరిస్థితులను నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖ పట్టకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమౌతోంది. కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. జనజీవనం కుదురుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడటానికి కారణమౌతాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి..
ఫిరాయింపుల వేళ: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు మహానాడులో కీలక బాధ్యతలు: హాజరు.. డౌటే
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2787కు చేరుకుంది. ఇందులో 1913 మంది పేషెంట్లు కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఐసొలేషన్ వార్డుల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. 58 మంది మరణించారు. ఇక యాక్టివ్ ఉన్న కేసుల సంఖ్య 816కు చేరుకున్నాయి. చాలాకాలం తరువాత యాక్టివ్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఒకదశలో యాక్టివ్ కేసుల సంఖ్య 700లకు కంటే దిగువకు వెళ్లిపోయింది.
డిశ్చార్జి అయిన పేషెంట్ల సంఖ్య భారీగా నమోదవుతూ వచ్చింది. అదే సమయంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావం రాష్ట్రంపై పడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు భారీగా నమోదు కావడానికి కారణమైంది. కోయంబేడు ప్రభావం దాదాపు ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం ఆరంభించింది. ఫలితంగా మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుదల బాట పట్టాయి.
యాక్టివ్ కేసులు 800 మార్క్ను దాటడం చాలాకాలం తరువాత ఇదే తొలిసారి. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులతో పోటీ పడుతూ డిశ్చార్జి అయిన పేషెంట్ల సంఖ్య నమోదవుతూ వచ్చాయి ఇన్ని రోజులు. 24 గంటల వ్యవధిలోనే 10 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు.ఈ సారి మాత్రం డిశ్చార్జి అయిన వారి కంటే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మొత్తం 9,664 మంది శాంపిళ్లను సేకరించారు. వారిలో 68 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
Recommended Video
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున సడలింపులను ఇచ్చిన ఈ పరిస్థితుల్లో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడం, కేసుల సంఖ్య పెరుగుతోండటం ఆందోళనకు దారి తీస్తోందని అధికారులు చెబుతున్నారు. తిరుమల సహా అన్ని దేవాలయాల్లోనూ భక్తులకు అనుమతించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరగడం వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.