ఏపీలో ఆ రెండు జిల్లాల్లో ఒక్కరోజే వందకు పైగా: గంటగంటకూ ప్రమాదకరంగా: బిత్తరపోతోన్న అధికారులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. గంటగంటకూ బలపడుతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వ్యర్థం చేస్తూ.. రోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో కనిపిస్తోన్న వేగం అధికారులను బిత్తరపోయేలా చేస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కరోనా కేసులు నమోదవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 704 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 18,114 శాంపిళ్లను పరిశీలించగా.. 704 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 648 కేసులు.. వేర్వేరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల 56 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 14,595కు చేరుకుంది.
ఇందులో 6511 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 187 మంది మరణించారు. యాక్టివ్గా ఉన్న పాజిటివ్ కేసులు 7897గా నమోదు అయ్యాయి. 24 గంటల్లో ఏడుమంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మరణవంచారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యవాత పడినట్లు అధికారులు తమ బులెటిన్లో స్పష్టం చేశారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 258 మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Recommended Video
24 గంటల్లో అత్యధికంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-104, చిత్తూరు-107 కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి-55, గుంటూరు-58, కడప-75, కృష్ణా-84, కర్నూలు-82, నెల్లూరు-5, ప్రకాశం-31, శ్రీకాకుళం-1, విశాఖపట్నం-26, విజయనగరం-13, పశ్చిమ గోదావరి-7 కేసులు నమోదు అయ్యాయి. ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.