ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: మరిన్ని గడ్డురోజులు: విస్తుపోయేలా పాజిటివ్ కేసుల పెరుగుదల
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే వస్తున్నాయి. కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తోంది. దీన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలను తీసుకుంటున్నప్పటికీ.. విజృంభణను అడ్డుకోలేకపోతోంది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన అయిదో విడత లాక్డౌన్ సందర్భంగా మరిన్ని సడలింపులను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకోవడం ఆంందోళన కలిగిస్తోందని వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య కాలంలో రాష్ట్రంలో 76 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ వల్ల ఇద్దరు చనిపోయారు. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరుకుంది. ఇందులో 2169 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య 64కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 885కు చేరుకుంది. ప్రస్తుతం ఈ 885 మంది కరోనా పేషెంట్లు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
24 గంటల వ్యవధిలో కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించగా 34 మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిలో ఇప్పటిదాకా 446 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 249. కువైట్, ఖతర్, దుబాయ్ సహా వివిధ దేశాల నుంచి రాష్ట్రానకి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 112 మంది వైరస్ బారిన పడ్డారు. వారంతా చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరూ చికిత్సలో ఉన్నారని, వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.