వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఒక్కరోజే వందకు పైగా..కళ్లు బైర్లు కమ్మేలా: ఆ 5 జిల్లాల్లో భయానకం
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విస్ఫోటం రాష్ట్రంలో కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు భయానకంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 813 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 14 వేలకు చేరువైంది.
వైఎస్ జగన్ సొంత జిల్లాలో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 24 గంటల్లో 111 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనే పాజిటివ్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 813 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 755 కేసులు.. వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా.. 58 కేసులు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు.
14 వేలకు చేరువగా..
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 13,098కి చేరుకుంది. ఇందులో 5908 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. 169 మంది మరణించారు. 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఆరుమంది, కృష్ణా జిల్లాలో అయిదుమంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్గా ఉన్నవి 7021గా నమోదు అయ్యాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 401 మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
కడపతో సమానంగా కర్నూలులో
కడపతో సమానంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 103 కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు-51, తూర్పు గోదావరి-57, గుంటూరు-90, కృష్ణా-79, నెల్లూరు-18, ప్రకాశం-41, విశాఖపట్నం-44, విజయనగరం-8, పశ్చిమ గోదావరి-71 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళంలో కొత్తగా ఏ కేసూ వెలుగు చూడలేదు. ప్రస్తుతం ఈ ఒక్క జిల్లాలోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 62 కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదు కాగా.. 39 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు. 21 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అయిదు జిల్లాల్లో వెయ్యికి పైగా..
మొత్తం అయిదు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు-1787, కృష్ణా-1331, అనంతపురం-1371 తూర్పు గోదావరి-1002, గుంటూరు-1193 కేసులు నమోదు అయ్యాయి. కడప-794, నెల్లూరు-579, ప్రకాశం-313, విశాఖపట్నం-505, విజయనగరం145, పశ్చిమ గోదావరి-875 పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదు కాగా.. ఆయా జిల్లాలన్నింట్లోనూ భారీ సంఖ్యలో డిశ్చార్జిలు నమోదు అవుతున్నాయి.
25 వేలకు పైగా పరీక్షలు..
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు గరిష్ఠస్థాయిలో నమోదు అయ్యాయి. 24 గంటల్లో 25,778 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులో ఇన్ని వేల సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించిన రాష్ట్రం మరొకటి లేదని వైద్యాధికారులు తెలిపారు. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ ఇప్పటిదాకా 8,41,860మందికి పైగా శాంపిళ్లను సేకరించి, పరీక్షించినట్లు వెల్లడించారు.