కరోనా పాజిటివ్ ట్రెండ్: ఏపీలో నాలుగంకెలకు కరోనా యాక్టివ్ కేసులు: మృతుల సంఖ్యలోనూ
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదివరకు 50కి కాస్త అటు, ఇటుగా నమోదవుతూ వచ్చిన కరోనా వైరస్ కేసులు వందకు చేరువగా ఉంటున్నాయి. వైరస్ కేసుల్లో పెరుగుదల సంఖ్య నెగెటివ్ ట్రెండ్స్లోకి వెళ్లింది. చాలాకాలం తరువాత తొలిసారిగా యాక్టివ్ కేసులు నాలుగంకెలను అధిగమించాయి. ఒకవంక డిశ్చార్జి అవుతోన్న కరోనా పేషెంట్ల సంఖ్య భారీగా నమోదవుతున్నప్పటికీ.. దానికి మించిన స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య మొత్తం 98 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవధిలో మొత్తం 9986 మంది కరోనా వైరస్ అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించారు పరీక్షలను పంపించారు. 98 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో 29 మంది కరోనా పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా, ముగ్గురు మరణించారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కోవిడ్ మరణాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజాగా నమోదైన పాజిటివ్స్తో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసులు 3377కు చేరుకున్నాయి. ఇందులో 2273 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య 71కి చేరుకుంది. యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 1033గా నమోదైంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 19 మంది చెన్నైలోని కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చినట్టుగా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారి కాంటాక్టుల కోసం ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిలో ఇప్పటిదాకా 119 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ముగ్గురు డిశ్చార్జి అయ్యారు.
Recommended Video
పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిలో ఇప్పటిదాకా 616 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 244 మంది డిశ్చార్జి అయ్యారు. వారిలో 33 మంది 24 గంటల వ్యవధిలో డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా నమోదైంది. స్వస్థలాలకు చేరుకున్న వారి కాంటాక్టుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.