ఏపీలో వెల్లువలా కరోనా కేసులు: ఒక్కరోజులో 98 మందికి: ఇదే టాప్..మున్ముందు ఇంకెంతో
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది. వెల్లువలా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనన్ని కేసులు వెలుగు చూశాయి. ఇదివరకు నమోదైన పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాయి. మున్ముందు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చినట్టయింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టకపోవచ్చని అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 98 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఓ రికార్డు. ఇంతకుముందు ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా 83 కేసులు నమోదు కాగా.. ఈ సారి ఆ సంఖ్యను అధిగమించాయి కొత్త కేసులు. ఫలితంగా- ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య మూడువేలను దాటేసింది. 3042కు చేరుకుంది.
అదే సమయంలో- వేర్వేరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్యలో కూడా ఆశించిన స్థాయిలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం 3042 పాజిటివ్ కేసుల్లో యాక్టివ్గా ఉన్నవి 845. మిగిలిన పేషెంట్లలో 2135 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా మరణించిన మొత్తం కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 62కు చేరుకుంది.
24 గంటల్లో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ స్పష్టం చేసింది. 24 గంటల్లో 43 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. కర్నూలు జిల్లాలో అత్యధిక డిశ్చార్జి నమోదైనట్లు తెలుస్తోంది. కాగా, విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన వారిలో 111 మందికి ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకిందని, వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.
మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిలో ఇప్పటిదాకా 418 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 221. 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. జూన్ నాటిలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.