బాధ్యతలను స్వీకరించిన అప్పలరాజు: తొలి సంతకం దానిపైనే: కీలక వ్యాఖ్యలతో
అమరావతి: రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం ఉదయం ఆయన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్-4, రూమ్ నంబర్: 132లో గల ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. కొత్తగా వైఎస్ జగన్ మంత్రివర్గంలో చేరిన ఆయనకు పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద అభివృద్ధి శాఖను కేటాయించారు. ఈ ఉదయం 8:30 గంటలకు ఆయన తన ఛాంబర్లో వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం ఆక్వాకల్చర్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో రొయ్యల సాగును అభివృద్ధి చేయడం, వాటిని రవాణా చేయడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన అథారిటీ ఇది. దీన్ని ఏర్పాటు చేయడానికి రూపొందించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ, మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు, అవసరమైనన్ని వనరులు ఉన్నాయని అన్నారు.
గత ప్రభుత్వం ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన చిత్తూరు పాల కర్మాగారం వంటి సంస్థలు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూతపడ్డాయని అన్నారు. తాము పాడి పరిశ్రమ, మత్స్య సంపద, అక్వా సాగు వంటి రంగాలను అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తానని అన్నారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల ఆనందంంగా ఉందని వ్యాఖ్యానించారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో 700 కోట్ల రూపాయలను కేటాయిందని అన్నారు. అమూల్ వంటి సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని అప్పలరాజు గుర్తు చేశారు. డాక్టరేట్ చదివిన అప్పలరాజు గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై 16 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. అయినప్పటికీ.. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది.