వైసీపీ నేత అయోధ్యా రామిరెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దేశంలోనే రెండో ధనిక ఎంపీగా: ఏడీఆర్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి రికార్డు సృష్టించారు. దేశంలోనే రెండో ధనిక రాజ్యసభ సభ్యుడిగా ఆవిర్భవించారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీకే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురే ప్రమాణం: అంబానీ ఫ్రెండ్ మిస్: ఇంటరెస్టింగ్ సీన్
ఏడీఆర్ నివేదికలో..
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభకు ఎన్నిక కాగా.. వేర్వేరు కారణాలతో పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. వారిలో వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది. కొత్త ఎంపీల ఆస్తుల వివరాలు, వారిపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచింది.
రెండో ధనిక ఎంపీగా..
ఈ నివేదిక ప్రకారం.. అయోధ్యా రామిరెడ్డి దేశంలోనే రెండో ధనిక రాజ్యసభ సభ్యుడిగా గర్తింపు పొందారు. ఆయనపై నమోదైన కేసుల గురించీ ఈ నివేదిలో పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన తోటి ఎంపీ పరిమళ్ నత్వానీకి మించిన ఆస్తులు ఉన్నాయి. అయోధ్యా రామిరెడ్డి ఆస్తుల విలువ 2,577 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ వెల్లడించింది. ఆయనకు 154 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు పేర్కొంది.
కేసులూ ఎక్కువే..
అలాగే- ఆయనకు 10 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయోధ్యా రామిరెడ్డిపై వేర్వేరు పోలీస్స్టేషన్లలో 10 కేసులు నమోదైన విషయాన్ని ఇందులో పేర్కొంది. దేశంలోనే ధనిక ఎంపీగా జనతాదళ్ (యునైటెడ్) సభ్యుడు మహేంద్ర ప్రసాద్ ఉన్నారు. మహేంద్ర ప్రసాద్ ఆస్తుల విలువ 4,078 కోట్ల రూపాయలు. బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) నుంచి ఆయన ఎన్నికయ్యారు. రెండో స్థానంలో అయోధ్యా రామిరెడ్డి, మూడో స్థానంలో జయాబచ్చన్ ఉన్నారు. సమాజ్వాది పార్టీ నుంచి ఇదివరకే ఎన్నికైన జయాబచ్చన్ ఆస్తుల విలువ 1001 కోట్ల రూపాయలు.
Recommended Video
రాజ్యసభలో 89 శాతం మంది కోటీశ్వరులే..
రాజ్యసభ సభ్యుల సంఖ్య 233 కాాగా.. ఇందులో మూడు ఖాళీలు ఉన్నాయి. 229 మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నారు. వారికి సంబంధించిన ఆస్తులను ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది. 229 మంది సిట్టింగ్ సభ్యుల్లో 203 మంది కోటీశ్వరులేనని వెల్లడించింది. 89 శాతం సభ్యులు కోట్లకు పడగలెత్తినట్లు పేర్కొంది. దీని ప్రకారం చూస్తే.. రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తుల విలువ 62.67 కోట్ల రూపాయలుగా తేలినట్లు ఏడీఆర్ వెల్లడించింది. పరిమళ్ నత్వానీ ఆస్తుల విలువ 396.83 కోట్ల రూపాయలు. మోపిదేవి వెంకటరమణ ఆస్తుల 7.35 కోట్ల రూపాయలు కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు మీద 12,82,877గా తేల్చింది.