ఆ పెళ్ళికొడుకు కష్టం ఇంతింత కాదయా ... లాక్ డౌన్ తో 14 మంది బంధువులు ఇంట్లోనే
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంటకు లాక్ డౌన్ కష్టాలు వచ్చి పడ్డాయి . అదేంటి శుభ్రంగా ఇంట్లోనే ఉండొచ్చు కదా ..కష్టమేముంది అనుకుంటున్నారా ? పాపం అసలు కష్టమే అది.. లాక్ డౌన్ కు రెండు రోజుల ముందు పెళ్ళయిన ఒక జంటకు ఇంటికి వచ్చిన బంధువులు సడన్ గా లాక్ డౌన్ విధించటంతో వరుడి ఇంట్లోనే ఉండిపోయారు. వారందరికీ వసతి కల్పించలేక, కనీసం కొత్తగా పెళ్ళయిన జంట ఒక 5 నిముషాలు మాట్లాడే ప్రైవసీ కూడా లేక నరకం అనుభవిస్తున్నారు. ఈ కష్టాలు మా వల్ల కాదు మహాప్రభో అని లబోదిబోమంటున్నారు నూతన వధూవరులు .
పెళ్ళికి 50 మందికి అనుమతి ఇచ్చిన కేంద్రం .. కానీ షరతులు వర్తిస్తాయి
లాక్ డౌన్ తో కొత్త జంటకు తిప్పలు
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక అనుకోకుండా , వివిధ శుభ కార్యాలకు ఇళ్ళకు వచ్చిన అతిధులు లాక్ డౌన్ తో అక్కడే లాక్ అయిపోయారు. ఇక కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఓ యువకుడు మార్చిలో పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి విశాఖ నుంచి బంధువులు వచ్చారు. పెళ్లి పూరైన రెండు రోజులకు ఊహించని విధంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అప్పటి నుంచి వరుడి ఇంట్లోనే బంధువులు ఉండిపోయారు. 40 రోజులుగా ఆ ఇంట్లోనే అందరూ ఉంటున్నారు.
14 మంది బంధువులను పోషిస్తున్న వరుడి కుటుంబం
14 మంది బంధువులను 40 రోజులుగా పోషిస్తున్నారు వరుడి కుటుంబ సభ్యులు . అటు నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు పనులు లేక , డబ్బు సంపాదించే మార్గాలు లేక అంత మందికి పోషణ చూడాలంటే ఇబ్బంది పడుతున్నారు. సొంత ఊర్లకు పంపాలని బంధువులు, వరుడు స్థానిక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, లాక్ డౌన్ కారణంగా అనుమతి ఇవ్వడం లేదని వాపోతున్నారు. సొంత వాహనాలు అయితే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్తున్నట్టు పెళ్లి కొడుకు తరపు బంధువులు చెప్తున్నారు.కానీ సొంత వాహనాలు లేక, ట్యాక్సీల వంటి వాటికి అనుమతి లేకపోవటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
లాక్ డౌన్ తో , ఇంట్లో బంధు గణంతో వధూవరుల కష్టాలు
పెళ్లి చేసుకుని ఎన్ని ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన నూతన వధూవరులకు లాక్ డౌన్ తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. అందరూ పెళ్లి చేసుకున్నాక వారి కొత్త జీవితాన్ని కొద్ది రోజుల పాటైనా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ నూతన వధూవరులకు ఇంటి నిండా ఉన్నబంధుగణంతో సరిపోతుంది. మాములు జీవితంలో వచ్చే కష్టాల కంటే, కరోనా ఉన్నప్పుడు, లాక్ డౌన్ విధించినప్పుడు పెళ్లి చేసుకుంటే , ఇక అదే సమయంలో అనుకోకుండా ఇంటి నిండా చుట్టాలు ఉంటె పాపం కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు పడే ఇబ్బంది వర్ణనాతీతం .
లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని బాధపడుతున్న ప్రజలు
ఇలా పెళ్లిళ్లకు వచ్చి బంధువుల ఇళ్ళల్లో ఇరుక్కుపోయిన వాళ్ళే కాదు, వివిధ పనుల మీద వెళ్లి ఇతర ప్రాంతాలలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వారు లేకపోలేదు . వారందరినీ ప్రభుత్వం చొరవ చూపి సొంత ఊర్లకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకుంటే వారందరి పరిస్థితి దుర్భరంగా తయారవుతుంది. ఏదో ఒకటి , రెండు రోజులు ఎవరైనా కొత్త వారిని భరిస్తారు కానీ 40 రోజులకు పైగా బంధువులను ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళ ఇళ్లలోనే ఉండటం అటు వారికి, వీరికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక ఇలాంటి వారిని ఇళ్ళకు చేర్చే ఆలోచన ప్రభుత్వాలు చెయ్యాల్సిన అవసరం ఉంది .