బీచ్లో కొత్తజంటకు వేధింపులు: భర్తను కొట్టి, భార్య పట్ల అసభ్యంగా..
విశాఖపట్నం: బీచ్లోసరదా గడిపేందుకు వచ్చిన ఓ కొత్త జంటకు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. వారిని వెంటపడి వేధింపులకు గురిచేయడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా పెళ్లయిన ఓ జంట సముద్ర తీరంలో కాసేపు సరదాగా గడిపేందు కోసం వచ్చింది. అయితే, అక్కడే తిరుగుతున్న ఏడుగురు యువకులు. అందరూ మైనర్లే. ఆ కొత్త జంట వెంటపడటం మొదలుపెట్టారు. వారి బైక్ను వెంబడిస్తూ అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు చేశారు.
అంతేగాక, ఆ కొత్త జంట బైక్ను ఢీకొట్టి.. భర్తను కొట్టి, భార్య చేతులు లాగుతూ, తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బంగారు ఆభరణాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురిచేశారు. కాగా, గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆ ఆకతాయి యువకులు అక్కడ్నుంచి పారిపోయారు.
అయితే, అందులో ఒకడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతడ్ని విచారించిన పోలీసులు.. మిగితా ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వీరిపై కేసులు నమోదు చేశామని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నామని పోలీసులు తెలిపారు. మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.