పెళ్లైన 20 రోజులకే భర్తపై దాడి చేసిన భార్యకు 14 రోజుల రిమాండ్: ప్రేమ వ్యవహారమే కారణమా?
శ్రీకాకుళం: పెళ్లైన 20 రోజులకే భర్త నవీన్ కుమార్పై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన భార్య నీలిమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తపై దాడి చేసినట్లుగా ఆమె అంగీకరించింది. ఆమెను ప్రవేశపెట్టిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. 14 రోజుల రిమాండ్ విధించారు. మూలనర్సాపురం గ్రామానికి చెందిన నవీన్పై భార్య నీలిమ సోమవారం దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇష్టంలేని పెళ్లి: 20 రోజులకే, బైక్పై వెళ్తూ భర్త మెడను కత్తితో కోసిన భార్య
నవీన్ అత్తగారింటి నుంచి బైక్ పైన భార్యతో కలిసి వస్తుండగా గ్రామంలోని తోటల వద్ద ఆమె దాడి చేసింది. నవీన్తో పెళ్లి ఇష్టం లేకపోవడం, మరొకరితో ప్రేమ కారణంగానే దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వీరికి ఇరవై రోజుల క్రితమే.. మే 9న పెళ్లయింది. ఆమెపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
భర్తను చంపాలని ప్లాన్
గొదలాంకు చెందిన నీలిమ ప్రియాగ్రహారం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివింది. కొన్ని నెలల క్రితం తండ్రి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తండ్రి ఆసుపత్రి ఖర్చు కోసం అప్పు చేశారు. తండ్రి లేని పిల్ల కావడంతో బంధువులు కలిసి నవీన్తో నీలిమ పెళ్లి జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. మొదట తానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ తాను చావడం కంటే భర్తను చంపడం ఉత్తమమని భావించింది.
ప్రేమ వ్యవహారం కారణమా?
నీలిమ ఒకరిని ప్రేమించిందని, ఆయనను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినా కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణలో వివరాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు నవీన్తో బలవంతపు పెళ్లి కారణంగా ఆమె ఈ దాడి చేసింది.
పక్కా ప్రణాళికతో దాడి
భర్త పైన ఆమె పక్కా ప్రణాళికతో దాడి చేసింది. ఆమె ముందుగా తనతో పాటు తెచ్చుకున్న కూరగాయల కత్తితో నవీన్ మెడపై బలంగా పొడిచింది. వెంటనే ఆయన తేరుకొని కేకలు వేశాడు. సమీప పొలంలో పనులు చేస్తున్న రైతులు అక్కడకు చేరుకొని రక్తం కారుతున్న నవీన్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్కు తరలించారు.
నవీన్ విచారణలో వాస్తవాలు బయటకు
నవీన్ను పోలీసులు విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. భర్తపై దాడి చేసిన నీలిమ చాకచక్యంగా తప్పించుకుంది. కానీ భర్త వాంగ్మూలంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె పెళ్లప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది.