భర్తను చంపించిన భార్య: సరస్వతి ప్రియుడు శివ అరెస్ట్, కేసులో మరో షాకింగ్ ట్విస్ట్!
విజయనగరం: విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన నవ వరుడు శంకర రావు హత్య కేసులో మరో కీలక నిందితుడు, వధువు సరస్వతి ప్రియుడు శివను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని శనివారం పట్టుకున్నట్లుగా సమాచారం.
చదవండి: సరస్వతి కోసం భర్త ఇంత చేస్తే: ఫేస్బుక్ ప్రియుడి కోసం చంపింది! కన్నీరుమున్నీరు
ఈ నెల 7వ తేదీన పక్కా ప్లాన్ ప్రకారం.. పెళ్లైన పది రోజులకే భార్య సరస్వతి భర్తను హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా శివను కూడా పట్టుకున్నారని తెలుస్తోంది.
ఓ బృందానికి చిక్కిన శివ
విజయనగరం జిల్లా ఎస్పీ పాలరాజు, పోలీసులు ఈ హత్య కేసును సవాల్గా తీసుకొని కొద్ది గంటల్లోనే చేధించారు. నిందితుల గాలింపు కోసం ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఓ బృందానికి శనివారం శివ చిక్కాడని తెలుస్తోంది. అతనిని పార్వతీపురం తరలించి విచారిస్తున్నారని కూడా తెలుస్తోంది.
మరిన్ని వివరాలు ఆరా తీస్తారు
అతనిని విజయవాడలో అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకులో అరెస్టు చేసినట్లుగా మరో సమాచారం. శివ హత్య జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు. సరస్వతితో పరిచయం, హత్యకు ప్లాన్ తదితర అంశాలపై అతని నుంచి పోలీసులు ఆరా తీయనున్నారు.
మరో ట్విస్ట్, ప్రియుడితో పారిపోతే లాభం లేదని
భర్త శంకర్ బెంగళూరులోని ఓ ప్రముఖ పవర్ పాయింట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని పేరుతో కొన్ని ఇన్సురెన్స్, ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి. తాజాగా ఈ విషయం కూడా వెలుగు చూసింది. హత్యకు ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. ప్రియుడితో పాటు ఇంటి నుంచి పారిపోతే ఎలాంటి లాభం లేదని భావించి, భర్తను చంపేసి, ఎవరో హత్య చేశారని చెబితే సానుభూతి వస్తుందని, దాంతో పాటు ఇన్సురెన్స్, ఎల్ఐసీ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు.
గతంలో అమ్మాయిని మోసం చేసిన శివ
శివకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని మోసం చేశాడని పోలీసులు గుర్తించారని సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. సరస్వతిని కూడా ఫేస్బుక్ పరిచయం ద్వారా ట్రాప్ చేసిన విషయం తెలిసిందే. శంకర్రావును హత్య చేస్తే ప్రియుడితో వెళ్లిపోవచ్చని సరస్వతి, ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయని శివ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. వీటిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
భర్తను చంపించిన భార్య
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం వద్ద మే 7న రాత్రి శంకర్రావు హత్య ప్లాన్ ప్రకారం జరిగిన విషయం తెలిసిందే. సరస్వతి, శివలు మరికొందరు నిందితులతో కలిసి ప్లాన్ ప్రకారం చంపేసి, దారి దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కేసును కొద్ది గంటల్లోనే చేధించారు.