నవవధువు అనుమానాస్పద మృతి, ఇటీవలే పుట్టింటికి
వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి ఉంగుటూరుకు చెందిన సూర్యచందర్, రజనీ దంపతులు వైజాగ్లో బిల్డర్గా పని చేస్తున్న కాటినేని జగన్కు తమ కూతురు దీపిక(24)ను ఇచ్చి ఫిబ్రవరి 9న వివాహం జరిపించారు. వివాహానంతరం వైజాగ్లో కాపురం పెట్టిన దీపిక వారం క్రితం కూకట్పల్లిలోని వెంకట్రావ్ నగర్లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
వారం రోజుల వరకు బాగానే ఉన్న దీపిక గురువారం ఉదయం తల్లిదండ్రులు బయటికి వెళ్లగా సోదరుడైన భాస్కర్ సుధీర్ వేరే గదిలో నిద్రిస్తుండగా మరొక గదిలో తలుపులు వేసుకొని చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల రాకతో నిద్రలేచిన భాస్కర్ గది తలుపులు బద్ధలుకొట్టి ఫ్యాన్కు వేళ్లాడుతున్న దీపిక వద్దకు వేళ్లేసరికే మృతి చెందినట్లు గమనించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీపిక ఆత్మహత్యకు గల కారణాలేమీ లేవంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన దీపిక వద్ద ఎటువంటి సూసైడ్నోటు లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీపిక బిటెక్ పూర్తి చేసింది. గతంలో ఓ ఉద్యోగం చేసి ఆ తర్వాత మానేసింది.