లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరం: ఎన్నికలపై సర్వేలు
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. అప్పటి నుండి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ల్యాంకో సంస్థ అధినేత లగడపాటి రాజగోపాల్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 వరకు తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర సంపాదించుకున్నారు. వైఎస్ మరణం తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించిన లగడపాటి రాజగోపాల్.. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు.
చివరి ప్రయత్నంగా 2014 ఫిబ్రవరిలో లోక్సభలో తెలంగాణ ఏర్పాటు కోసం 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014' ఆమోదానికి ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే చల్లారు. ఆ తర్వాత లగడపాటి రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించి.. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేలు వెల్లడిస్తున్నారు. అప్పుడప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతోనూ సమావేశమవుతున్నారు.