APSRTC కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు భారీ ఊరట: ఆ వార్తల్లో నిజంలేదన్న మంత్రి పేర్నినాని
అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో అంతా నష్టాలనే చవిచూస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలుకాగా... తిరిగి దాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇక ఈ ప్రభావం పలువురి ఉద్యోగస్తులపై కూడా పడింది. చాలా సంస్థల్లో ఉద్యోగస్తుల వేతనాల్లో కోత విధించడమే కాకుండా కొందరిని తొలగించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఏపీయస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తొలుత వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది.
కరోనా వైరస్ కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో దాదాపు 6,270 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగించడం లేదని వారికి ఇన్ష్యూరెన్స్ లేకపోవడంతో బీమా కలిగి ఉన్న పర్మినెంట్ ఉద్యోగస్తులు ముందుగా డ్యూటీలో జాయిన్ కావాలంటూ సర్క్యులర్ జారీ చేసినట్లు మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక వాస్తవాలు తెలియకుండా విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు మంత్రి పేర్ని నాని.
ఇక జీతాల విషయం గురించి ప్రస్తావించిన మంత్రి పేర్ని నాని.. ఆర్టీసీ సంక్షోభంలోకి వెళ్లిపోవడంతో జీతాలు చెల్లించలేకపోయామని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం లేదని చెప్పారు. వారంతా యధావిధిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడమే జరుగుతుంది కానీ ఒకరి ఉద్యోగం తీసేసి వారి పొట్టకొట్టే మనస్తత్వం తమ ప్రభుత్వానిది కాదని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇక మంత్రి పేర్ని నాని ప్రకటనతో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
ఇదిలా ఉంటే దాదాపు 6వేలకు పైగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు యాజమాన్యం తొలగించాలని భావిస్తోందని చెబుతూ వాట్సాప్ మెసేజ్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది ఆర్టీసీ వైస్ ఛైర్మెన్ మరియు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ కార్యాలయం నుంచి సర్క్యులేట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంప్లాయీస్ యూనియన్ తమ బాధను మంత్రి పేర్నినాని వద్ద వ్యక్తం చేసింది. ఉద్యోగస్తులను తొలగించరాదంటూ కేంద్ర ప్రభుత్వం తమ గైడ్లైన్స్లో పేర్కొందన్న విషయాన్ని ఎంప్లాయిస్ యూనియన్ మంత్రి పేర్నినానికి గుర్తు చేసింది.