టీడీపీకి అశోక్ గజపతి దూరం -పెద్దాయన రాయబారం : కాషాయం కండువా-కారణం అదేనా..!!
ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీని వీడటానికి సిద్దమయ్యారా. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న అశోక్ ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో సుదీర్గ చరిత్ర ఉన్న పూసలపాటి వంశంలో రెండో తరానికి చెందిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన విజయనగరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
2014 లో ఎంపీగా గెలిచి మోదీ తొలి టర్మ్ లో కేంద్ర మంత్రిగా పని చేసారు. పెద్దరికంగా ఉండే అశోక్ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘ కాలంగా మాన్సస్ ఛైర్మన్ గా ఉన్న ఆయన్ను తొలిగించి ..సంచయితను ఛైర్మన్ గా చేసారు. దీని పైన అశోక్ సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేసి మరళా ఛైర్మన్ పీఠం దక్కించకున్నారు. ఇక, కొంత కాలంగా ఆయన హాయంలో మాన్సాస్ లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఆడిటింగ్ సైతం నిర్వహించలదేనే అంశాలు బయటకు వచ్చి..ఇప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు.
వైసీపీ నేతలకు టార్గెట్ గా..
వైసీపీ నేతలకు అశోక్ టార్గెట్ అయ్యారు. వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి..అదే విధంగా మంత్రి వెల్లంపల్లి నేరుగా అశోక్ గజపతి పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారి తీసాయి. క్షత్రియ సంఘం దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్లలో ప్రకటన ఇచ్చింది. దీనికి కౌంటర్ గా మంత్రి రంగనాధ రాజు మరో ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కొంత కాలంగా వివాదాలతో అశోక్ మనస్థాపానికి గురయ్యారు. ఈ సమయంలో టీడీపీ నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించటం లేదు. దీంతో పాటుగా అశోక్ పైన కేసులు సైతం నమోదు చేస్తారని ప్రచారం సాగుతోంది.
టీడీపీపై మనస్థాపం..టచ్ లో బీజేపీ నేతలు..
దీంతో..తాను ఇంత కాలం నమ్ముకున్న పార్టీ..తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవకపోవటం పైన అశోక్ గజపతి మనస్థాపంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో..కొందరు బీజేపీ నేతలు..అశోక్ తో టచ్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న..అశోక్ కు సన్నిహితమైన పెద్దాయన సైతం ఈ దిశగానే సూచించినట్లుగా సమాచారం. తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని గతంలో అశోక్ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు జరుగుతన్న ప్రచారం పైన మాత్రం స్పందించటం లేదు.
బీజేపీతో మైత్రి వీడటం ఇష్టంలేక..
2019 ఎన్నికల ముందు టీడీపీ కేంద్ర కేబినెట్ లో నుంచి బయటకు రావటం..బీజేపీతో దూరం అయ్యే సమయంలోనూ అశోక్ ఆ నిర్ణయాన్ని తప్పు బట్టారని అప్పట్లోనే ప్రచారం సాగింది. కానీ, పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత సైతం బీజేపీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడ లేదు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తనను కావాలని డామేజ్ చేస్తుందనే భావనలో అశోక్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
బీజేపీలోకి వస్తే అనుభవం..కుటుంబానికి ఉన్న గుర్తింపు తగినట్లుగా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాయబారంలో విశాఖకు చెందిన ఒక కీలక నేత సైతం ఉన్నట్లు సమాచారం. దీని పైన అశోక్ గజపతి రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.