ప్రశాంత్ కిషోర్ వైపు చంద్రబాబు చూపు..ఐప్యాక్తో ఒప్పందం..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించడంతో అంతటి ఘనవిజయం వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్పై దేశంలోని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా సమాలోచనలు చేస్తోంది. ఇప్పుడు ఆ మాస్టర్ బ్రెయిన్ సలహాలు సూచనలు తీసుకేనేందుకు చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
ప్రశాంత్ కిషోర్తో టచ్లోకి చంద్రబాబు..?
ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. అసలు పరిచయం అక్కర్లేని పేరు. 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్... ఆ తర్వాత వరుస విజయాలు చూశారు. తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. దీంతో ప్రశాంత్ కిషోర్ను ఇప్పటికే హైర్ చేసేసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇక తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏపీలో కోలుకోలేని దెబ్బ తిన్న టీడీపీ ఇకపై చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న కన్సల్టెన్సీ ఐప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి చంద్రబాబు కొన్నేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
జగన్ విజయానికి కృషి చేసిన ఐప్యాక్
ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్కు చివరిసారిగా వరించిన విజయం ఏపీలో వైసీపీ విక్టరీ. భారీ విజయంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ పై అక్రమాస్తుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి ఏమవుతుందో అన్న సమయంలో ప్రశాంత్ కిషోర్తో వైసీపీ అధినేత 2017లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ పడిన తొలి అడుగు జగన్ 3600 కిలో మీటర్ల పాదయాత్ర. ఈ పాదయాత్రే జగన్ విజయానికి దోహదపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ప్రజలను దగ్గరగా ఉండి చూశారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవడంతో పాటు ప్రజల్లో భరోసా నింపేందుకు దోహదపడింది.
ప్రశాంత్ సలహాల కోసం ఎదురు చూస్తోన్న టీడీపీ..?
ఇక జగన్ ఎలా అయితే గ్రాండ్ విక్టరీ నమోదు చేశారో... టీడీపీకి కూడా అలాంటి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఐప్యాక్తో చంద్రబాబు జట్టుకడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. 2016లోనే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో జట్టుకట్టాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో ఆ ఒప్పందం ఫలించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్... తను పార్టీలో చేరడానికి ఐప్యాక్తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఐప్యాక్ సంస్థ స్వతంత్ర సంస్థ అని అది కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్తో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిషోర్ సాధించిన విజయాలు
ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా 2013లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో ఎన్నికల క్యాంపెయినింగ్ ప్రారంభించారు. ఇదే 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో దోహదపడింది. విభిన్నంగా క్యాంపెయినింగ్ చేయడం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవడం, ప్రచారాలకు క్రియేటివ్ పేర్లను జోడించడంతో అది ప్రజల్లోకి బాగా వెళ్లింది.దీంతో 2014లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ప్రశాంత్ కిషోర్. సొంతంగా 2015లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐప్యాక్ను స్థాపించారు. బీహార్లో నితీష్ కుమార్ బద్ద శత్రువైన లాలూతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడం వెనక ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఇక బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ను ప్రణాళిక మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సలహాదారుడిగా నియమించుకున్నారు. ఇక ఆ తర్వాత 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఐప్యాక్ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేసినప్పటికీ ఎస్పీలో అప్పటికే నెలకొన్న విబేధాలతో వర్కౌట్ కాలేదు.
మొత్తానికి ఐప్యాక్తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.