కియా మోటార్స్ ఎక్కడికీ తరలిపోవడం లేదు..వార్తలను ఖండించిన ఎంపీ విజయ్ సాయిరెడ్డి
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కియా మోటార్స్ తమిళనాడుకు తరలిస్తున్నారన్న వార్తలు ఆంధ్రప్రదేశ్ను కుదిపేశాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ రైటర్స్ పత్రిక కథనం పూర్తిగా అవాస్తవమని అన్నారు పరిశ్రమలు వాణిజ్యం పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ. రైటర్స్లో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆంధ్రప్రదేశ్పై విషప్రచారం చేయడం సరికాదని అన్నారు. కియా మోటార్స్ ఎక్కడికి తరలిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంస్థకు సహకరిస్తోందని చెప్పారు. ఇలాంటి నిరాధారమైన కథనాలను ప్రజలు విశ్వసించరాదని చెప్పారు.
Recommended Video
ఇక తాజాగా వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయ్ సాయిరెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. కియా మోటార్స్ ఎక్కడికి వెళ్లిపోవడంలేదని ఆ సంస్థ ఆపరేషన్స్ అనంతపురం జిల్లా పెనుగొండ నుంచే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. కియా మోటార్స్ ఏపీని వీడి తమిళనాడుకు వెళుతోందంటూ వస్తున్న వార్తల్లో వాస్తం లేదని విజయ్ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ కియా సంస్థతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని విజయ్ సాయిరెడ్డి చెప్పారు. ఏపీలో కియా ప్లాంట్ విస్తరణకు కూడా అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని విజయ్ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా కియా మోటార్స్ తరలింపు విషయంపై స్పందించింది. కియా ప్లాంట్ను తమిళనాడుకు మారుస్తున్నారంటూ ఆ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది పళనిస్వామి సర్కార్. ఇక అంతర్జాతీయ పత్రిక రైటర్స్ కథనం ప్రకారం కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలి పోతోందనే వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి చెప్పినట్లుగా కథనం ప్రచురితమైంది.
The rumours being spread by some media outlets about #KIA Motors shifting its plant out of AP are absolutely false. Our Govt. led by Hon’ble CM YS Jagan garu shares an excellent relationship with KIA and we are fully supportive of their growth plans in AP.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 6, 2020
వచ్చేవారం సెక్రటరీ స్థాయి సమావేశం కూడా ఉంటుందని కథనంలో రాసుకొచ్చింది రైటర్స్ పత్రిక. అయితే అలాంటిదేమీ లేదని.. తమను ఎవరూ సంప్రదించలేదని తాము కూడా ఎవరితోను సమావేశం కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ఓ పెద్ద ప్లాంట్ను మరోచోటికి మార్చడం కష్టమైన పని అని ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ప్లాంట్ విస్తరణ చేయాలని భావిస్తే.. అప్పుడు తమిళనాడులో ఒక ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉంటుందని తమిళ ప్రభుత్వం వెల్లడించింది.