ఏపీలో కరోనా కేసులకు బ్రేకుల్లేవ్: మరణాలూ పెరిగాయ్: జనజీవనం కుదురుకుంటోన్న వేళ..
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాటి పట్టింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టాల కూడా కనిపించట్లేదు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటోన్న వేళ.. జనజీవనం కుదురుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. బస్సుల రాకపోకలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
వైఎస్ జగన్ సంచలన నిర్ణయం: తన ప్రభుత్వంపై తానే: దాని ఆధారంగానే యాక్షన్ ప్లాన్:
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2514కు చేరింది. ఇందులో 1731 మంది ఇప్పటిదాకా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 55 మంది మరణించారు. ప్రస్తుతం 728 మంది పేషెంట్లు వేర్వేరు ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 51 మంది డిశ్చార్జి అయ్యారని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 55కు చేరుకుంది.
Recommended Video
వరుసగా నాలుగు రోజులుగా కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే వస్తున్నాయి. అదే సమయంలో డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య కూడా భారీగా నమోదు అవుతోంది. కర్నూలులో 24 గంటల్లో 16 మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధిక కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో.. అదే స్థాయిలో పేషెంట్లు డిశ్చార్జి అవుతున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టగా..చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పెరుగుతున్నాయని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని తెలిపారు.