మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!
అమరావతి: పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం.. సుమారు అయిదేళ్ల కిందటి మాట ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విలేకరుల సమావేశంలో చెప్పిన మాట. మాట తప్పడు అనే పేరుంది వైఎస్ కుటుంబానికి. అందుకేనేమో! చెప్పినట్టే కొట్టాడు. చెప్పి మరీ కొట్టాడు.
తాజాగా ముగిసిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారాయన. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ సీట్లను గెలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచీ అండదండగా ఉంటూ వచ్చిన చాలా జిల్లాల్లో తెలుగుదేశం కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఎదురైన పరాజయాన్ని, పరాభవాన్ని విజయంగా మలచుకోగలిగారు. దీనికోసం శ్రమించారు. చెమటోడ్చారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా.. కోలుకోలేనంతగా దెబ్బకొట్టారు.
సీఎస్గా ఎల్వీ కొనసాగింపు: ప్రభుత్వ సలహాదారుడిగా అజయ్ కళ్లాం: జగన్ కీలక నిర్ణయాలు..!
తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా నినాదాన్ని అణగదొక్కడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకోగలిగారు. హోదా నినాదాన్ని సజీవంగా ఉంచగలిగారు. దీనికోసం యువభేరీలను నిర్వహించారు. మూడురోజుల పాటు నిరాహార దీక్షలను చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర దాడులు ఎదురైనా ప్రతిఘటించారు. తన తండ్రికి మల్లే పాదయాత్ర చేశారు. తండ్రిని మించి 3684 కిలోమీటర్లు నడిచారు. ప్రతి నియోజకవర్గాన్ని పలకరించారు. సాధ్యం అయ్యే హామీలను మాత్రమే ఇచ్చారు.
తేనె తుట్టె వంటి కాపు రిజర్వేషన్ డిమాండ్పై తన వైఖరేమిటో స్పష్టంగా చెప్పేశారు. కాపు రిజర్వేషన్ను అమలు చేయడం తమ వల్ల కాదని, అది కేంద్రం చేతుల్లో ఉందని తేల్చి పడేశారు. అలవికాని హామీలను ఇవ్వబోనని ముందే ప్రకటించేశారు. ఓటర్లలో ఆలోచనలను రేకెత్తించారు. మోసపూరిత వాగ్దానాలు చెయ్యబోనని అన్నారు. ఓడితే తానొక్కడినేనని, గెలిస్తే.. రాష్ట్ర ప్రజలందరూ గెలిచినట్టేనంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆయన వైపు మొగ్గేలా చేశాయి.