‘మాదే అధికారం-జననేత జగనే సీఎం’: ఢిల్లీలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేక్ కట్ చేశారు.
ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిలాగే వైయస్ జగన్ విశ్వసనీయత కలిగిన నేత అని కొనియాడారు.
2019లో మాదే అధికారం
తన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు జగన్ అని అన్నారు. అలాంటి నాయకుడు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని విజయసాయి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
జగనే సీఎం
ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యం కోసం వైయస్ జగన్ దేనికి భయపడకుండా నిరతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
పార్టీకి బంగారు భవిష్యత్
వైయస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని మరో ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం యువనేత జగన్ నిరంతరం పోరాడుతూనే ఉన్నారని చెప్పారు.
జైల్లో పెట్టినా..
16నెలలు జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై జగన్ తన పోరాటం ఆపలేదని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే పార్టీ వైసీపీ అని అన్నారు. వైసీపీ విలువలు కలిగిన పార్టీ అని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉందని ఎంపీ వరప్రసాద్ అన్నారు.