రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం: ప్రశ్నించొద్దంటూ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖలు
కర్నూలు: ఎన్టీఆర్ హెల్తీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతోపాటు పలువురు మండిపడుతున్నారు. వీసీ పదవిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని మండిపడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి మరీ రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారని శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.
మనది పేద దేశం.. ఎవరినీ ఏమీ చేయలేరు. కర్నూలు సర్వజన వైద్యశాలకు వైద్యులు రాకపోవడం పెద్ద సమస్య కాదు. ఏ స్థాయిలోనైనా అవినీతి జరుగుతూనే ఉంటుంది. వైద్యులకు మనం రూ. 2 లక్షల జీతం ఇస్తుంటే.. బయట రూ. 5 లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే.. అవినీతి, చెడు పనుల గురించి మాట్లాడకూడదని వీసీ శ్యామ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి అవుతారంటూ చెప్పుకొచ్చారు. అయితే, వీసీ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. అవినీతి గురించి ప్రశ్నించొద్దంటూ వ్యాఖ్యానించి యువతకు, ఉద్యోగులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ధ్వజమెత్తారు.