కాకినాడలో ఇళ్ల స్ధలాల కోసం మడ అడవుల నరికివేత- జగన్ సర్కారుకు ఎన్జీటీ షాక్....
సముద్ర తీర ప్రాంతాలను తుఫానులు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలంటే సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులు తప్పనిసరి. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో విపత్తులు సంభవించినప్పుడు నగరాలు, పట్ణణాలు సైతం కనుమరుగు కాక తప్పదు. కానీ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఇలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మడ అడవులను పేదల ఇళ్ల స్ధలాల పేరుతో అడ్డగోలుగా నరికివేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
కాకినాడలో మడ అడవుల నరికివేత..
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న దుమ్ముల పేట గ్రామం వద్ద భారీ స్ధాయిలో మడ అడవులు ఉన్నాయి. తీర ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ మడ అడవుల వల్ల స్ధానికంగా కాకినాడ నగరానికి తుఫాన్లు, సునామీ ముప్పు నుంచి రక్షణ లభిస్తోంది. అయితే తాజాగా పేదలకు పంచేందుకు అనుకున్న స్ధాయిలో ఖాళీ స్ధలాలు దొరక్కపోవడంతో స్ధానిక అధికారుల దృష్టి మడ అడవుల మీద పడింది. అనుకున్నదే తడవుగా మడ అడవులను నరికివేత ప్రారంభించారు. కాకినాడ పరిధిలోని 50 వార్డుల్లో ఊుంటున్న దాదాపు 25 వేల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు తీర ప్రాంతంలోని యాంకరేజ్ పోర్టు భూములను స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్లు 375, 376/1లో ఉన్న ఇవన్నీ మడ అడవులే. వీటికి ఆనుకుని ఉన్న ఉప్పుటేరు కాలువ ద్వారా మత్సకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్తుంటారు.
ఆరోపణలు, స్ధానికుల ఫిర్యాదులతో...
కాకినాడ తీరంలో మడ అడవుల నరికివేతపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ కేసు వేయడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పందించింది. విచారణ కోసం ఐదుగురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని తెలుసుకోవడంతో పాటు అంతకు ముందు అక్కడ ఎంత విస్తీర్ణంలో మడ అడవులు ఉండేవి, ఇప్పుడు ఏ స్ధాయిలో ఉన్నాయనే అంశాలను శాటిలైట్ మ్యాప్ ల ఆధారంగా పరిశీలించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అటు ఎన్టీటీ- ఇటు హైకోర్టు- చిక్కుల్లో ప్రభుత్వం...
మడ అడవుల నరికివేత వ్యవహారంలో స్ధానికంగా నిరసనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా ముందుకెళ్లిన ప్రభుత్వం.. ఎన్జీటీ ఆదేశాలతో ఇబ్బందుల్లో పడింది. తక్షణం అక్కడ అన్ని పనులను నిలిపేయాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో అధికారులకు గట్టి షాక్ తగిలింది.
నిపుణుల కమిటీ విచారణలో అడవుల నరికివేత నిర్ధారణ అయితే ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా బాధ్యులవుతారని హరిత ట్రైబ్యునల్ హెచ్చరించింది. నిపుణుల కమిటీ క్షేత్రస్ధాయిలో వాస్తవాల నిర్ధారణ కోసం స్ధానికంగా పలుమార్లు పర్యటించనుంది. అలాగే శాటిలైట్ చిత్రాలను పరిశీలించనుంది. అలాగే అడవుల పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందో కూడా అంచనా వేయనుంది. హరిత ట్రైబ్యునల్లో ఈ కేసు విచారణ ఆగస్టు 18కి వాయిదా పడింది. మరోవైపు మడ అడవుల నరికివేతపై హైకోర్టులోనూ కేసు దాఖలైంది. విచారణ సందర్భంగా అడవులను నరికివేయలేదంటూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.