ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ: పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీ స్టే, నిపుణులతో కమిటీ
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పీక్ స్టేజెస్కు చేరుకుని ఇక కోర్టుల చుట్టూ వ్యవహారం నడుస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న పోతిరెడ్డి పాడు వ్యవహారంపై ఈరోజు ఏపీ ప్రభుత్వానికి షాకిస్తూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది.
Recommended Video
ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గతంలోనే ఆదేశించింది. తాజాగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించింది. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణపనులు చేపట్టరాదని వెల్లడించింది.
ఇక ఈ వ్యవహారంపై నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో కేసును విచారణ చేసిన బెంచ్... నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. అదే సమయంలో కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది.
ఇక ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీలో కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్కు చెందినవారికి కమిటీలో సభ్యత్వం కల్పించినట్లు ఎన్జీటీ తెలిపింది. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఎన్జీటీ సూచించింది. ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడుపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఏపీలో పర్యావరణ అనుమతుల్లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) గతేడాది ఆదేశించింది. గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని నాడు కోరింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్రెడ్డి ఎన్జీటీలో నాడు పిటిషన్ దాఖలు చేశారు.