పోలవరంపై ఎన్టీటీ తీవ్ర వ్యాఖ్యలు- ఉత్తరాఖండ్ తరహా ముప్పు- నిపుణుల కమిటీ ఏర్పాటు
పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇవాళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా పర్యవేక్షణ కోసం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించాలని నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించినట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపింది. పర్యావరణ సమస్యలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. పదే పదే సమస్యలు తలెత్తడానికి పర్యావరణ లోపాలే కారణమని ఎన్జీటీ తెలిపింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్లో తాజాగా చోటు చేసుకున్న ప్రళయం ఏపీలోనూ రిపీట్అవుతుందని హెచ్చరించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అంశాల పర్యవేక్షణకు ఓ నిపుణుల కమిటీని త్వరలో నియమించనుంది.
పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ అంశాల పర్యవేక్షణ కోసం నియమించే కమిటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహించనున్నారు. అలాగే ఈ కమిటీలో వివిధ ఐఐటీ ఐఐఎస్ఆర్ నిపుణులకు కూడా స్ధానం కల్పిస్తారు. ఈ నిపుణులు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అంశాలపై దృష్టిసారిస్తారు. వీరి నివేదికల ఆధారంగా ఏపీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ప్రాజెక్టు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పర్యావరణ అంశాల ఉల్లంఘన విషయంలో ఎన్టీటీ కమిటీ ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.