వెట్టిచాకిరి?: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సుమోటోగా కేసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుములపల్లి వద్ద ఇటుకబట్టీలో పనిచేస్తున్న 32 మంది ఒడిశాకు చెందిన కూలీల(వీరిలో 12 బాలలు) బాధలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నోటీసులు పంపింది.
సుమోటాగా కేసు నమోదు
ఈ మీడియా కథనాలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇటుక బట్టీల నుంచి తమను రక్షించాలంటూ కూలీలు వేడుకున్న కథనాలను పరిశీలిస్తే .. స్థానిక అధికార యంత్రాంగం కనీసం పట్టించుకున్నట్లు లేదని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ సీఎస్కు నోటీసులు
ఆ కూలీలకు స్వేచ్ఛను ఇవ్వాలని, అందుకు సంబంధించిన నివేదికను వారంలోగా తమకు అందజేయాలని ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. కూలీల మొరను పట్టించుకోని అధికారులపై, ఆ ఇటుక బట్టీల యజమానిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
అదేంలేదంటూ తహసీల్దార్..
కాగా, అనంతపురం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఆ ఇటుక బట్టీలను సందర్శించి అక్కడ పనిచేస్తున్న బాలలను ఆస్పత్రిలో చేర్పించారు. వారి వయస్సును నిర్ధారించేందుకు బుధవారం వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.
గార్లదిన్నె తహసీల్దార్ మాట్లాడుతూ.. ఒడిశాలోని బోలంగిర్లోని కూలీలను పంపిణీ చేసే ఓ వ్యక్తి ద్వారా రూ. 35వేలు ఆ కూలీలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదేమీ వెట్టిచాకిరి కాదని అన్నారు.
1976లోనే వెట్టిచాకిరిపై నిషేధం..
జాతీయ మానవహక్కుల సంఘం నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బుధవారం ఆ కూలీలను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, 1976లోనే వెట్టిచాకిరి విధానంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.