ఆ ఇద్దరి హత్య కేసులో నలుగురి అరెస్ట్ : త్వరలో మరి కొంతమందిని పట్టుకుంటాం : ఎన్ఐఏ
ఏపిలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు..మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా హత్య కేసులో ఎన్ఐఏ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసారు. ఈ ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసారని నిర్దారణకు వచ్చినా..వారికి ఎవరు సహకరించారనే దాని పై ఏపి పోలీసులు దృష్టి సారించారు. అప్పటి నుండి దీని పై ప్రత్యేక సిట్ బృందం విచారణ సాగిస్తోంది. కాగా, వీరిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చూపించారు.
వైసిపి నుండి గెలిచి టిడిపి లో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో ఎన్ఐఏ బృందం నలుగురి ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా సెస్టెంబర్ 23వతేదీన గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతుండగా నిషిద్ధ మావోయిస్టులు కాల్పులు జరపడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. కాగా... ఈ సంఘటనను రాష్ట్రప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించడంతోపాటు మావోయిస్టులపై ఉక్కుపాదాన్ని మోపింది.
కాగా... ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో సంబంధం ఉన్న యెండల సుబ్బారావు, శోభన్, ఈశ్వరి, కొర్రా కమలను ఎన్ఐఏ అధికారులు ఈనెల 6తేదీన అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా మరికొంత మంది నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. హత్య ఘటన..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల పై పోలీసు శాఖ స్థానికంగా ఉన్న అధికారుల పైనా చర్యలు తీసుకుంది. ఆ తరువాత ఈ కేసు ను ప్రత్యేక విచారణ కోసం సిట్ కు అప్పగించారు.
అప్పటి నుండి సిట్ విచారణ కొనసాగిస్తోంది. స్థానికంగా కొంత మంది చిన్న పాటి రాజకీయ నేతలు మావోయస్టలకు సమాచారం ఇచ్చారనే కోణంలోనూ విచారణ జరిగింది. మావోయిస్టులను పట్టుకొనేందుకు ఒడిశా ప్రభుత్వంతోనూ చర్చలు జరిపింది. తాజాగా, ఎన్ఐఏ అధికారులు వీరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో మరణిం చిన సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రి పదవి..సోము కుమారుడికి ఎస్సీ-ఎస్టీ కమిషన్ లో పదవి ప్రభుత్వం కట్టబెట్టింది.