హైదరాబాద్కు అసదుల్లా: పాతబస్తీలో ఇంట్లో సోదాలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ కీలకమైన ప్రగతి సాధించింది. నేపాల్ - భారత్ సరిహద్దుల్లో ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్తో పాటు అరెస్టు చేసిన అసదుల్లా అక్తర్ను ఎన్ఐఎ అధికారులు హైదరాబాద్ తీసుకుని వచ్చారు. పేలుళ్లకు పాల్పడడానికి హైదరాబాదులో నివాసం ఉన్న ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.
మూడు రోజుల క్రితం పిటి వారంట్పై అసదుల్లాను ఎన్ఐఎ అధికారులు హైదరాబాదు తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు దిగిన హైదరాబాదులోని బహదూర్పురాలో గల ఇంట్లో వారు సోదాలు నిర్వహించారు. బాంబుల తయారీకి వాడే పదార్థాలను వారు ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాదులోని దిల్షుక్నగర్లో పేలుళ్లకు పాల్పడడానికి వారం రోజుల ముందు ఉగ్రవాదులు ఆ ఇంట్లో దిగినట్లు భావిస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరులో బాంబులు తయారు చేశారని, వాటి విడిభాగాలను తీసుకుని వచ్చి హైదరాబాదులో అసెంబుల్ చేశారని ఎన్ఐఎ గుర్తించినట్లు సమాచారం. మంగళూర్లో బాంబులు తయారు చేసిన ప్రాంతాన్ని కూడా ఎన్ఐఎ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
దిల్షుక్నగర్లో ఫిబ్రవరిలో జంట పేలుళ్లు సంభవించి 17 మంది మరణించారు. ఇటీవల అరెస్టు చేసిన యాసిన్ భత్కల్, అసదుల్లా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. ఈ కేసులోనే వారిద్దరిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.