జగన్ కేసులో పోలీసులు సహకరించట్లేదు: ఎన్ఐఏ, ఏపీ పోలీసుల విస్మయం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ, సిట్ మధ్య కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) పోలీసుల పైన ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సిట్ పోలీసులు రికార్డులు ఇవ్వడం లేదని ఈ పిటిషన్ వేశారు. ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయస్థానం వాదనలు విన్నది. అనంతరం ఈ పిటిషన్ పైన విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు, జగన్ పైన దాడి కేసులో ఎన్ఐఏ పిటిషన్ పైన ఏపీ పోలీసులు విస్మయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. జగన్ కేసులో సాక్ష్యాలను ఇప్పటికే కోర్టుకు అందించామని చెబుతున్నారు.
ఎన్ఐఏ అధికారులు అవసరమైతే వాటిని కోర్టు నుంచి తీసుకోవచ్చునని చెప్పారు. ఎన్ఐఏ అధికారులు వస్తే ఎస్కార్ట్ కూడా ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర హోంశాఖ అదేశాలపై పిటిషన్ దాఖలు చేస్తామంటున్నారు.