దిల్షుక్నగర్ పేలుళ్లు: హైదరాబాద్ కోర్టుకు నిందితులు
హైదరాబాద్: దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఎన్ఐఎ అధికారులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, వకాస్ అలియాస్ జియా వుర్ రెహ్మాన్లను అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నిందితులను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు తీసుకుని వచ్చారు.
వకాస్ పాకిస్తానీ జాతీయుడు. హైదరాబాదులోని దిల్షుక్నగర్లో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రత్యేక న్యాయమూర్తి ఐఎస్ మెహతా అంగీకరించారు.
దిల్షుక్నగర్ పేలుళ్లతో వారిద్దరికి సంబంధం ఉన్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవని, వారిని ఒప్పించడం ద్వారా సాక్ష్యాలను తయారు చేయాలని ఎన్ఐఎ ప్రయత్నిస్తోందని డిఫెన్స్ తరఫు న్యాయవాది అక్రమ్ ఖాన్ అన్నారు
మార్చిలో అరెస్టయిన వకాస్కు పలు ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2011 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుతో అతనికి సంబంధం ఉంది. వకాస్ను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు తెహిసీన్ను అరెస్టు చేసారు. తెహసీన్ బాంబు తయారీలో నిపుణుడని తెలుస్తోంది.