జాతీయ విపత్తుల నివారణ కేంద్రం...తాత్కాలికంగా బాపట్లలో ఏర్పాటు
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీని అనుసరించి ఎపిలో ఏర్పాటుచేయనున్న జాతీయ విపత్తుల నివారణ కేంద్రం(ఎన్ఐడిఎం)ను తాత్కాలికంగా గుంటూరు జిల్లా బాపట్లలో ఏర్పాటు చెయ్యనున్నట్లు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిపిన్మాలిక్ అన్నారు.
బాపట్లలోని మానవ వనరుల అభివృద్ది కేంద్రం భవనంలో జాతీయ విపత్తుల నివారణపై అవగాహన కోసం ఎపి ప్రభుత్వం మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన శిక్షణా తరగతులను ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిపిన్మాలిక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఐడిఎం కోసం ఎపి ప్రభుత్వం గన్నవరంలో 10 ఎకరాల భూమి కేటాయించిందని, అయితే అక్కడ శాశ్వత భవనాల నిర్మాణం ఆలస్యం అవుతున్నందువల్ల బాపట్ల లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని తాత్కాలిక భవనాల్లో జాతీయ విపత్తుల నివారణ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా బిపిన్మాలిక్ శిక్షణార్థులకు తుఫాన్లు, భూకంపాలు, వరదలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు...ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఇక్కడ జరిగే మూడు రోజుల శిక్షణ తరగతుల్లో మొదటి రోజు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు, రెండో రోజు సముద్రతీర ప్రాంత ప్రజలకు, చివరి రోజు స్వచ్ఛంద సేవాసంస్థలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
కేంద్రంలో జాయింట్ అసిస్టెంట్ ఆఫీసర్ స్థాయి అధికారి ఎపిలో ఏర్పాటు చేసే ఎన్ఐడిఎం కు పర్యవేక్షకుడిగా ఉంటారని ఆయన తెలిపారు. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు అవగాహనను కల్పించాలన్నారు. వేసవిలో సముద్రతీర ప్రాంతంలో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వాటిపై కూడా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు. అనంతరం మానవవనరుల అభివృద్ధి కేంద్రంలోని తాత్కాలిక భవనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలో దక్షిణ భారత జాతీయ విపత్తుల నివారణ కేంద్రాన్నితాత్కాలికంగా ఏర్పాటు చేసినందుకు వివిధ సంఘాల ప్రజలు ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిపిన్మాలిక్ ధన్యవాదాలు తెలిపారు.