స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం నిఘా యాప్.. ఫిర్యాదు వెళ్లిందో అభ్యర్థి పని ఔట్
అమరావతి: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్టువేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్ రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఇవాళ తాడేపల్లిలోని తన నివాసంలో ఈ యాప్ను ఆవిష్కరించారు.
నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనుకునేవారిని ప్రోత్సహించడంతో పాటు, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నివారించి, అవినీతికి అడ్డుకటువేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలసంఘం, పోలీస్ వ్యవస్ధ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్ను రూపొందించింది. సామాన్యులెవరైనా ఈ నిఘా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు.
ఇక ఇప్పటికే సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్నతాధికారులతో సమావేశం కావడమే కాదు.. తన సొంత మంత్రులకు కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచి ఓటర్లను ఎవరైనా ప్రభావితం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదని చెప్పారు. సొంత పార్టీ నేతలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలకు సొంత పార్టీ నేతలు దిగినా చర్యలు తప్పవని వెల్లడించారు.
Recommended Video
ఇక నిఘా యాప్ కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బ్రహ్మాస్త్రంగా మారనుంది. ఏ అభ్యర్థి అయినా సరే మద్యం పంచుతూ లేదా ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బులు పంచుతూ కంటపడితే నిఘా యాప్ ద్వారా ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు... అభ్యర్థిపై వెంటనే విచారణ జరిగి నిజమని తేలితే అనర్హత వేటు కూడా వేయడం జరుగుతుంది.