నిమ్మగడ్డ తొలి నుంచి అంతే, రహస్య భేటీలో ఆంతర్యమేంటీ..? చంద్రబాబు మంత్రాంగమే: మోపిదేవి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం తొలి నుంచి వివాదాస్పదమేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్తో భేటీ అవడంతో ప్రపంచానికి తెలిసిందన్నారు. అయితే వారు రహస్యంగా సమావేశం అవడంలో ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు. ఇదీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆడించిన నాటకం అని విమర్శించారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు. చంద్రబాబు నడిపించిన మంత్రాంగాన్ని వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తారు.. తల్లిని కూడా కలువనీయలేదు అని కామెంట్ చేస్తారని మండిపడ్డారు. ఇప్పుడే కాదు తొలి నుంచి నిమ్మగడ్డ వ్యవహారం వివాదాస్పదమేనని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రభుత్వం ఎస్ఈసీగా తిరస్కరించినందున.. తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
పనిలోపనిగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. గత ప్రభుత్వ హయాంలో మీరు చేసిన ఘోరాల వల్ల ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు 23 సీట్లకే పరిమితం చేసిన.. చంద్రబాబు బుద్ది మాత్రం మారలేదున్నారు. కానీ తాము ఇచ్చిన మాట మేరకు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తొలి ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ దేశంలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారని గుర్తుచేశారు ఇవీ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.