పార్టీని వదిలి వ్యవసాయం చేసుకుంటున్న టిడిపి ఎంపీ, కారణం అదేనా?
అనంతపురం: హిందూపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత నిమ్మల కిష్టప్ప ఆరు మాసాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారని తెలుస్తోంది. నేతలతో పొసగక పోవడం వల్లే ఆయన దూరంగా ఉంటున్నారంటున్నారు.
గత కొద్ది కాలంగా ఆయన వ్యవసాయం, సొంత పనులు మినహా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదని, అందుకు జిల్లాలోని కొందరు నేతలతో పొసగక పోవడమే కారణమని చెబుతున్నారు. అంతేకాదు, నిమ్మలకు మొదట్లో ఉన్నంత ప్రాధాన్యం ఇప్పుడు లేదని అనుచరులు వాపోతున్నారని తెలుస్తోంది.
హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను కాదని ఆయా నియోజకవర్గాలలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని తెలుస్తోంది. హిందూపురం పార్లమెంట్ పరిధిలో హిందూపురం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడు, ధర్మవరం, మడకశిర, పెనుకొండ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
సంబంధిత ఎమ్మెల్యేలు పిలిస్తే తప్ప కార్యక్రమాలకు కిష్టప్ప హాజరుకావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయచి. ఇటీవల పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడుకు కూడా కిష్టప్ప హాజరుకాలేదు. జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడుల్లో కూడా ఆయన కనిపించలేదంటున్నారు.
ఇందుకు ఆయా స్థానిక నేతలతో ఉన్న గ్యాప్ కారణమని చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్ పైకి కనిపించడం లేదని అంటున్నారు. ఈ గ్యాప్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన వాపోతున్నారని అంటున్నారు. మరోవైపు, ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయిందని, అందుకే ఎక్కువగా బయట తిరగడం లేదని, అంతే తప్ప మరో కారణం లేదని మరికొందరు చెబుతున్నారు.