లోకసభలో టిడిపి ఎంపీ భావోద్వేగం, తెలంగాణపై డొక్కా
న్యూఢిల్లీ/విజయవాడ: అనంతపురం జిల్లాలో పరిస్థితి పైన తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప లోకసభలో భావోద్వేగానికి గురయ్యారు. కరువు పరిస్థితి పైన లోకసభలో బుధవారం నాడు చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మాట్లాడారు. ఆయన ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. కరవుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కరవు జిల్లాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు.
కేంద్రం పంపుతున్న కరువు బృందం తాత్కాలికంగా పర్యటనలు చేస్తోంది తప్ప ప్రయోజనం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి నదుల అనుసంధానం చేయాలనే ఆలోచన ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలని ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప విజ్ఞప్తి చేశారు.
రాద్దాంతం వద్దు: డొక్కా
నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం నాడు విజయవాడలో అన్నారు. సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణలో వైసిపి నేతలు ప్రాజెక్టుల టెండర్లు తీసుకొని, ఏపీలో దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.