సంచలనం: ప్రతీకారంతో రౌడీ షీటర్ సుబ్బు హత్య ప్లాన్ ఇదీ
విజయవాడ: రౌడీ షీటర్ కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి (33) హత్యకు నిందితులు రచించిన పథకం గురించి విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సావంగ్ శుక్రవారంనాడు వెల్లడించారు. సుబ్బు హత్యలో 9 మంది పాలు పంచుకున్నట్లు ఆయన తెలిపారు.
డిసెంబర్ 6వ తేదీన విజయవాడలోని మాచవరంలో సుబ్బు హత్య జరిగిన విషయం తెలిసిందే. సుబ్బును ఆరుగురు కత్తులతో పొడిచి చంపి, బైకులపై పారిపోయారని గౌతం సావంగ్ తెలిపారు. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
నిందితుల కదలికల వీడియో...
సిసిటీవీ వీడియో ఫుటేజీ ద్వారా హత్య జరిగిన రోజు నిందితుల కదలికలను గౌతం సావంగ్ మీడియా ప్రతినిధులకు చూపించారు. నిందితుల్లో ఒక్కతను విజయవాడకు చెందినవాడు కాగా, మిగతావారంతా గుంటూరు జిల్లాకు చెందినవారు.
ఎవరీ సుబ్బు?: పగ తీరకపోతే మమ్మల్ని కూడా చంపమన్న భార్య.. హత్యతో ఉలిక్కిపడ్డ బెజవాడ..
సుబ్బ హత్య కేసు నిందితులు వీరే...
నిందితుల పేర్లను కూడా సావంగ్ వెల్లడించారు. వారు - బాల భాస్కర్ అలియాస్ బాలయ్య, సముద్రాల పవన్ కుమార్, కామేపల్లి లక్ష్మయ్య, అద్దంకి సుధాకర్ తోమాటి నగారజు అలియాస్ కిల్లి నాని, గద్దేటి సురేంద్ర, దురు వజ్రాల బాబు. వేమూరి బుజ్జి హత్యలో పాలు పంచుకున్న మొహమ్మద్ గాలిబ్ నిందితులకు ఆశ్రయం కల్పించాడు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురు రౌడీ షీటర్లే.
అప్పటి నుంచి పగలు..
గద్దేటి సురేంద్రకు, వేమూరి సుబ్బుకు మధ్య 2014 నుంచి వైరం కొనసాగుతోంది. వేమూరి సుబ్బు, అతని సోదరుడు తెనాలిలో మేడిశెట్టి కృష్ణ హత్యలో పాలు పంచుకున్నారు. మేడిశెట్టి కృష్ణ బంధువులు, మిత్రులు పథకం ప్రకారం 2015లో సుబ్బు సోదరుడు కాళిదాసు సత్యంను చంపేశారు. అప్పటి నుంచి సుబ్బ విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో తన కుటుంబంతో ఉంటున్నాడు.
ప్లాన్ చేసి ఇలా కత్తులు కొన్నారు...
సుబ్బును హత్య చేయాలని ప్లాన్ వేసుకున్న తర్వాత విజయవాడకు వెళ్లి నిందితులు కత్తులు కొనుగోలు చేశారు. వారు తెనాలికి చెందినవారు కావడంతో విజయవాడలో వారికి మొహమ్మద్ గాలిబ్ ఆశ్రయం కల్పించాడు. కత్తులను గాలిబ్ షెడ్డులో దాచి పెట్టారు. హత్యకు ముందు తిరుపతి వెళ్లి గుండ్లు చేయించుకున్నారు. నకిలీ పేర్లతో ఆరు మొబైల్ ఫోన్లు, స్విమ్లు తీసుకున్నారు. మిత్రుల నుంచి, బంధువుల నుంచి బైకులు తీసుకున్నారు.
సుబ్బు టీ స్టాల్కు వెళ్తాడని...
సుబ్బు క్రమం తప్పకుండా మాచవరంలోని టీ స్టాల్కు వెళ్తాడని నిందితులు గుర్తించారు. అక్కడే దాడి చేయాలని గద్దేటి సురేంద్ర, బాలయ్య, లక్ష్మయ్, పవన్, సుధాకర్, నాగరాజు ప్లాన్ వేసుకున్నారు. వారు తెనాలి నుంచి డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి 6 గంటలకు విజయవాడ చేరుకున్నారు. వజ్రాల బాబును టీ స్టాల్ దగ్గర పెట్టి మిగతావారంతా గాలి ఇంట్లో ఉన్నారు.
వారు ఇలా వెళ్లారు....
వజ్రాల బాబు నుంచి సమాచారం అందగానే పవన్ అలియాస్ లడ్డు ఒక బైకుపై, లక్ష్మయ్య, పవన్ అలియాస్ లడ్డు మరో బైకుపై, అరుణ్, సుధాకర్ మూడో బైకుపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుబ్బు సిమెంట్ బెంచీపై కూర్చోగానే కత్తితో మొదట బాలయ్య దాడి చేశాడు. ఆ తర్వాత మిగతా వారు దాడి చేశారు. తీవ్రమైన గాయాలతో సుబ్బు పడిపోగానే వారు అక్కడి నుంచి పారిపోయారు.