మత్తు-చిత్తు: మద్యం దొరక్క శానిటైజర్ తాగి ప్రకాశం జిల్లాలో 9 మంది మృతి
ప్రకాశం: కరోనావైరస్ విజృంభిస్తుండటంతో మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వైద్యులు శానిటైజర్తో చేతులు శుభ్ర పరుచుకోవాలని చెబుతున్నారు. అయితే శానిటైజర్ను వినియోగించాల్సిన పద్ధతిలో వినియోగించకుండా చాలామంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఇదే జరిగింది.
అన్లాక్ 3 వేళ.. మైండ్ బ్లాక్ చేస్తోన్న కరోనా ఫిగర్స్: ఏపీ వాటా ఎఫెక్ట్?: సడలింపులతో మరింత
శానిటైజర్ తాగి...
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. శానిటైజర్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండటం ఆ శానిటైజర్ సేవించడంతో వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందిన వారిలో ముగ్గురు భిక్షాటన చేసేవారు కాగా గా మరో ఆరుగురు కురిచేడు గ్రామస్తులుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క కొందరు శానిటైజర్లను సేవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మద్యానికి బానిసలైన యాచకులు మద్యం దొరక్క పోవడంతో శానిటైజర్ తాగేవారని పోలీసులు చెబుతున్నారు. యాచకుల్లో ఒకరు శానిటైజర్ సేవించి కడుపులో మంట అధికమవడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. భిక్షాటన చేసేవారు శానిటైజర్ తాగుతున్న సమయంలో గ్రామస్తులు గుర్తించి వారించారని అయినప్పటికీ వారు వినకుండా శానిటైజర్ తాగేశారని గ్రామస్తులు చెప్పారు.
స్థానికులు వారిస్తున్నప్పటికీ...
ఇదిలా ఉంటే కురిచేడు గ్రామంలో నివాసముండే మరో వ్యక్తి రమణయ్య నాటుసారాలో శానిటైజర్ కలిపి తాగాడని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానికులు వారించినప్పటికీ వినకుండా శానిటైజర్ తాగి రాత్రి ఇంటికి వెళ్లాడు. అపస్మారక స్థితిలోకి జారుకున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ రమణయ్యను దర్శి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే రమణయ్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Recommended Video
సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ
ఇక ఇదే కురిచేడు గ్రామంలో మరిన్ని మరణాలు వెలుగు చూశాయి. వీరంతా శానిటైజర్ తాగి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్పందించారు. 10రోజులుగా మద్యం దొరక్క శానిటైజర్ తాగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. చుట్టు పక్కల అమ్ముతున్న శానిటైజర్లను సీజ్ చేసి పరీక్షలకు పంపుతామని ఎస్పీ చెప్పారు. ఇక శానిటైజర్ను నేరుగా తాగారా లేక నాటుసారాతో కలిపి తాగారా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పిన కౌశల్... దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని వెల్లడించారు. మొత్తంగా శానిటైజర్ తాగి నిన్న ముగ్గురు మృతి చెందగా శుక్రవారం మరో ఆరుగురు మృతి చెందారు.